Telangana Parties : తెలంగాణ గడ్డపై రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. విలువలు వలువలు విప్పుకుంటున్నాయి. నిన్నటి దాకా వీధి పోరాటాలు చేసిన వారు, నేడు పడకగది పొత్తులకు సిద్ధపడుతున్నారు. సిద్ధాంతం ‘సున్నా’.. అధికారం ‘మిన్న’ అన్న చందంగా సాగుతున్న ఈ మున్సిపల్ ‘మిలాఖత్’ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు (Municipal elections) వెలువడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్న దృశ్యాలు సామాన్య ఓటరును విస్తుపోయేలా చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఒకరినొకరు తిట్టుకున్న తిట్లు, పోసుకున్న శాపనార్థాలు ఇంకా గాలిలో ఉండగానే.. పదవుల పంపకాల కోసం అదే నేతలు ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసి ‘భాయీ-భాయీ’ అంటూ నవ్వులు చిందిస్తున్నారు. ఇది రాజకీయ చాణక్యమా? లేక పచ్చి అవకాశవాదమా? (Opportunism) అంటే, ఇది ఖచ్చితంగా ప్రజా తీర్పును కాలరాసే ‘రాజకీయ దిగజారుడుతనం’ (Unethical Politics) అని ఘంటాపథంగా చెప్పవచ్చు.
Telangana Parties సిద్ధాంతాల స్మశానం..!
ప్రతి రాజకీయ పార్టీకి ఒక జెండా ఉంటుంది, ఆ జెండా వెనుక ఒక అజెండా ఉంటుంది. కానీ, నేడు ఆ అజెండా కేవలం ‘అధికారం’ అనే ఏకైక అంశం చుట్టూనే తిరుగుతోంది. సుమారు 36 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు. ఎవరికీ పూర్తి అధికారం ఇవ్వకూడదనేది ప్రజల ఉద్దేశ్యం కావచ్చు, కానీ నాయకులు మాత్రం ఆ తీర్పును తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ గడ్డి కరవడానికైనా సిద్ధపడ్డారు.
ఆదిలాబాద్ ను ఉదాహరణగా తీసుకుంటే, అక్కడ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, చిత్రమేమిటంటే.. రాష్ట్ర స్థాయిలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎంలు (Telangana Parties) అక్కడ ‘త్రిమూర్తులు’గా మారిపోయాయి. బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు ఏకమవ్వడం ఏ రకమైన రాజకీయ నీతి? ఒకరి సిద్ధాంతం మరొకరికి పడదు, ఒకరి ముఖం మరొకరు చూసుకోరు.. కానీ అధికారం కోసం మాత్రం వీరు ఏకమయ్యారు (Opportunism) . కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిని అందరూ కలిసి కుర్చీలో కూర్చోబెట్టడం చూస్తుంటే, అక్కడ గెలిచింది ప్రజాస్వామ్యం కాదు, ‘అపవిత్ర పొత్తు’ అని స్పష్టమవుతోంది.
ఇది కూడా చదవండి: Epstein Files: పెద్దోళ్ల బేవర్స్ పనులు..!
ఆరోపణలు వేరు.. ఆలింగనాలు వేరు!
గాంధీ భవన్ వేదికగా “బిఆర్ఎస్-బీజేపీ ఒక్కటే” అని కాంగ్రెస్ నేతలు గొంతు చించుకుంటారు. అటు బీజేపీ నేతలు “కాంగ్రెస్-బిఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం” చేసుకున్నాయని ఆరోపిస్తారు. కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఈ మాటలన్నీ నీటి మూటలని తేలిపోయింది.
నర్సాపూర్, ఆమనగల్లు దృశ్యాలు చూస్తే ఎవరికైనా పిచ్చెక్కక మానదు. అక్కడ కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం సహకరించుకున్నాయి. ఒకరికి చైర్మన్ పదవి, మరొకరికి వైస్ చైర్మన్ పదవి. అంటే, పై స్థాయిలో వీరు కొట్టుకుంటారు.. కింద స్థాయిలో మాత్రం పదవులను పంచుకుంటారు.
మెదక్ లో బీజేపీ గైర్హాజరు కావడం వెనుక ఉన్న ‘మర్మం’ ఏమిటి? కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటుతో పీఠం దక్కించుకోవడానికి పరోక్షంగా సహకరించడం రాజకీయ వ్యూహమా లేక ఓటర్లకు చేస్తున్న ద్రోహమా?
ఇస్నాపూర్ లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తన ఓటును బిఆర్ఎస్ అభ్యర్థికి వేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడ పార్టీ కండువాల రంగులు మారాయేమో కానీ, లోపల ఉన్న ‘అవకాశవాదం’ (Opportunism) మాత్రం ఒక్కటే.
ఆర్థిక ప్రయోజనాలే అసలు లక్ష్యమా?
మున్సిపల్ పీఠం కోసం ఇంతగా పాకులాడటం వెనుక కేవలం ప్రజాసేవ ఉందనుకుంటే అది అమాయకత్వమే అవుతుంది. మున్సిపల్ చైర్మన్ పదవి అంటే అది కోట్లాది రూపాయల నిధులకు, వేలాది ఎకరాల భూముల అనుమతులకు, టెండర్లకు కేంద్ర బిందువు.
“రాజకీయ అధికారం అనేది ప్రజాసేవకు మార్గం కావాలి, కానీ నేడు అది అక్రమార్జనకు రహదారిగా మారింది.”
భూముల లేఅవుట్లు, కమర్షియల్ పర్మిషన్లు, మున్సిపల్ కాంట్రాక్టులు.. ఇవన్నీ చైర్మన్ పీఠం దక్కితేనే సాధ్యం. అందుకే తన బద్ధశత్రువైనా సరే, పదవిలో వాటా ఇస్తే చాలు అనే స్థాయికి నేతలు దిగజారిపోయారు. ఆత్మగౌరవం కంటే ‘ఆర్థిక గౌరవం’ ముఖ్యం అనుకుంటున్నారు.
ఇది కూడా చదవండి : Aalin Sherin: మరణం గమ్యం కాదు… మరో జన్మకు మార్గం
బలిపశువులవుతున్న కార్యకర్తలు
ఈ ‘అడ్డగోలు’ పొత్తుల వల్ల అత్యంత ఘోరంగా నష్టపోయేది గ్రామాల్లో, వార్డుల్లో ఉండే సామాన్య కార్యకర్తలే. ఎన్నికల సమయంలో తమ నాయకుడు చెప్పిన మాటలు నమ్మి, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలతో గొడవలకు దిగుతారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతారు, కేసులు వేయించుకుంటారు, ఊర్లో శత్రుత్వాన్ని పెంచుకుంటారు. తీరా ఫలితాలు వచ్చాక, తాము ఎవరినైతే ‘శత్రువు’గా భావించారో, తమ నాయకుడు అదే వ్యక్తితో కలిసి విందులు ఆరగిస్తూ కనిపిస్తే.. ఆ కార్యకర్త గుండె ఎంతలా రగులుతుందో నేతలు ఆలోచించడం లేదు.
కార్యకర్తల త్యాగాలను తాకట్టు పెట్టి, నేతలు తమ పీఠాలను పదిలం చేసుకుంటున్నారు. ఈ ‘మిలాఖత్’ రాజకీయాలు కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రేపు మళ్ళీ ఎన్నికలు వస్తే, ఏ మొహం పెట్టుకుని ప్రత్యర్థి పార్టీని విమర్శించాలి? ఏ జెండా పట్టుకుని ప్రజల వద్దకు వెళ్ళాలి? అనే ప్రశ్నలకు సమాధానం లేదు.
ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణం
ప్రజలు ఒక అభ్యర్థికి ఓటు వేసేటప్పుడు ఆ వ్యక్తి గుణగణాలతో పాటు, ఆ పార్టీ సిద్ధాంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కానీ గెలిచిన ప్రతినిధులు తమ సొంత లాభం కోసం వ్యతిరేక పార్టీకి మద్దతు తెలపడం అంటే.. అది ఓటరును వెన్నుపోటు (Opportunism) పొడవడమే. ఇది ఒక రకమైన ‘రాజకీయ వ్యభిచారం’.
నైతికత లేని రాజకీయం సమాజానికి ప్రమాదకరం. తెలంగాణలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు భవిష్యత్తు తరాలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాయి? “పదవి కోసం ఎవరి కాళ్ళయినా పట్టుకోవచ్చు, ఎవరినైనా మోసం చేయవచ్చు” అనే సంకేతాలు వెళ్తున్నాయి. ఇది వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తోంది.
ఆత్మ విమర్శ ఎవరికి?
రాజకీయ పార్టీలు (Telangana Parties) ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోవాలి. తాము ఎవరి కోసం ఈ రాజకీయాలు చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెడితే, రేపు ప్రజలు మిమ్మల్ని చరిత్ర హీనులుగానే చూస్తారు.
ముఖ్యంగా ఓటర్లు కూడా మేల్కోవాల్సిన సమయం ఇది. తమ ఓట్లతో గెలిచిన వారు, తమ తీర్పుకు వ్యతిరేకంగా పని చేస్తుంటే ప్రశ్నించే గొంతుకలు పెరగాలి. ఈ ‘అపవిత్ర కలయికలు’ ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో “రాజకీయాలు అంటేనే ఒక అపవిత్ర క్రీడ” (Unethical Politics) అనే ముద్ర శాశ్వతంగా పడిపోతుంది.
















