NewsDabba

TBJP: తెలంగాణపై బీజేపీ ఆశలు వదిలేసుకుందా?

TBJP: “దక్షిణాదిలో అధికారం మాదే… తెలంగాణలో కాషాయ జెండా ఎగరేస్తాం…” ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ అగ్రనేతలు పదేపదే వల్లించే పొలిటికల్ నినాదమిది! మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 8 ఎంపీ స్థానాలను గెలుచుకుని, తెలంగాణను దక్షిణాదిలో తమ బలమైన కోటగా చిత్రీకరించుకున్న బీజేపీ… సరిగ్గా కీలకమైన జాతీయ కార్యవర్గ విస్తరణ సమయానికి వచ్చేసరికి సొంత రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా? పూర్తి నిరాశ… ఘోరమైన మొండిచేయి!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) ప్రకటించిన సరికొత్త జాతీయ ఆఫీస్ బేరర్ల జాబితా తెలంగాణ బీజేపీ  (TBJP) శ్రేణులను నిశ్చేష్టులను చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, జాతీయ కార్యవర్గంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం దక్కకపోవడం చరిత్రలో ఇదే ప్రథమం. దక్షిణాదిలోని మిగతా అన్ని రాష్ట్రాలకూ పెద్దపీట వేసి… బలంగా ఎదిగామని చెప్పుకుంటున్న తెలంగాణను దారుణంగా పక్కనపెట్టడం వెనుక అసలు కథేంటి? ఇది అధిష్ఠానం వ్యూహాత్మక నిర్లక్ష్యమా? లేక అంతర్గత ముఠా తగాదాలతో విసిగిపోయిన పెద్దలు ఇచ్చిన నిర్దాక్షిణ్యమైన షాక్ ట్రీట్మెంటా..?

నమ్మశక్యం కాని పతనం!

నిన్నటివరకు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన రాష్ట్ర నాయకులకు ఈ జాబితా కోలుకోలేని దెబ్బ తీసింది. గత జాతీయ కార్యవర్గంలో కీలక పదవుల్లో ఉన్న ముగ్గురు కీలక నేతలను అధిష్ఠానం ముకుమ్మడిగా తప్పించింది. 2020 నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు (DK Aruna) ఈసారి చోటు దక్కలేదు. 2022లో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లి, జాతీయ స్థాయిలో ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా చక్రం తిప్పిన సీనియర్ నేత డాక్టర్ కె. లక్ష్మణ్‌ను (K Lakshman) బాధ్యతల నుంచి తొలగించారు. అటు 2023లో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రైతు విభాగం (కిసాన్ మోర్చా) ఇన్‌ఛార్జ్‌గా నియమించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) పదవి కూడా చేజారిపోయింది. గత కమిటీలో ముగ్గురు ఉంటే… ప్రస్తుత కమిటీలో తెలంగాణ నుంచి ఆ సంఖ్య ‘సున్నా’కు పడిపోవడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది.

BRS Defected MLAs
Defected MLAs: ఫిరాయింపు ఎమ్మెల్యేల తిరుగుబాటు!

ఇది కూడా చదవండి: Saptdhara: ‘సప్తధార’తో భారత్ రూపురేఖలు మారబోతున్నాయా?

దక్షిణాదిలో తెలంగాణకే నో ప్లేస్!

ఈ నిర్ణయం తెలంగాణ నేతలకు (TBJP) మరింత మింగుడుపడకపోవడానికి ప్రధాన కారణం… దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు లభించిన ప్రాధాన్యం! పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్ మాధవ్ (ఢిల్లీ కోటా అయినప్పటికీ), దగ్గుబాటి పురందేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డిలకు జాతీయ జట్టులో స్థానం దక్కింది. కర్ణాటక నుంచి ప్రొఫెసర్ ఎం. నాగరాజకు జాతీయ ఉపాధ్యక్ష పదవి లభించగా, తమిళనాడు నుంచి డాక్టర్ ఎం. వెంకటేశన్ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేరళ నుంచి కె. సురేంద్రన్, అనిల్ ఆంటోనీలు జాతీయ కార్యదర్శి పదవులను దక్కించుకున్నారు. బీజేపీకి పెద్దగా ప్రజాబలం లేని రాష్ట్రాలకు సైతం పదవులు కట్టబెట్టి, ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులను గెలిపించి, భవిష్యత్ ఆశాకిరణంగా చెప్పుకుంటున్న తెలంగాణను పూర్తిగా ఖాళీగా వదిలేయడం వెనుక దాగివున్న మర్మం ఏమిటనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

గ్రూపు రాజకీయాలపై అధిష్ఠానం మొట్టికాయ?

ఈ తీవ్రమైన నిర్ణయానికి కారణం తెలంగాణ బీజేపీ (TBJP) నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు, అంతర్గత విభేదాలేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన ఎంపీలు, సీనియర్ నాయకులు నిత్యం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడమే దీనికి ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈ వర్గపోరు పతాక స్థాయికి చేరి రచ్చకెక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) హైదరాబాద్ బహిరంగ సభలో పాల్గొని ‘తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యం’ అని దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత జూన్‌లో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) స్వయంగా రాష్ట్రంలో పర్యటించి విభేదాలు వీడాలని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి (Kishan Reddy), కె. లక్ష్మణ్ తదితరులు ఇరు వర్గాలను ఏకం చేసేందుకు సమన్వయ సమావేశాలు నిర్వహించినప్పటికీ… నేతల ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అధిష్ఠానం తీవ్ర అసంతృప్తితో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఫలించని లాబీయింగ్!

జాతీయ కార్యవర్గంలో చోటు కోసం రాష్ట్ర నాయకత్వం సైతం బంగారు శ్రుతి, జి. ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, దుగ్గియాల ప్రదీప్ రావు వంటి పేర్లను సిఫార్సు చేసినట్లు సమాచారం. అయితే, అధిష్ఠానం ఈ ప్రతిపాదనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. గతంలో అమిత్ షా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో పి. మురళీధర్ రావు జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఎస్. కుమార్ ఎస్సీ మోర్చా కార్యదర్శిగా కీలకంగా వ్యవహరించిన చరిత్ర ఉంది. అలాంటి నేపథ్యం ఉన్న రాష్ట్రానికి నేడు కనీసం ఒక్క జాతీయ కార్యదర్శి పోస్టు కూడా దక్కకపోవడం గమనార్హం.

Kondapalli Ganesh
Kondapalli Ganesh: అమ్మ గణేషూ.. ఇంత మోసమా..!?

ఆశలన్నీ మంత్రివర్గ విస్తరణపైనేనా?

ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు (Ramachandar Rao) నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. జాతీయ పోస్టులను రాష్ట్రాల కోటా ప్రకారం కాకుండా సంస్థాగత అవసరాల దృష్ట్యా భర్తీ చేస్తారని, ప్రాంతీయ ఆకాంక్షల కంటే దేశవ్యాప్త బలోపేతమే ప్రాధాన్యమని ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు, ఈస్ట్-వెస్ట్ పొలిటికల్ ఈక్వేషన్లలో భాగంగా ఈటల రాజేందర్, డీకే అరుణ వంటి నేతలు భవిష్యత్‌లో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలోనైనా తమకు న్యాయం జరుగుతుందని, అక్కడ పదవులు దక్కుతాయనే ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే, జాతీయ ఆఫీస్ బేరర్ల జాబితాలోనే స్థానం దక్కని ప్రస్తుత పరిస్థితుల్లో కేబినెట్ బెర్తులు ఎంతవరకు దక్కుతాయనేది సందేహమే!

ఇది కూడా చదవండి: Defected MLAs: ఫిరాయింపు ఎమ్మెల్యేల తిరుగుబాటు!

తెలంగాణలో అధికారమే లక్ష్యమని రంకెలేసే కమలనాథులకు ఢిల్లీ నాయకత్వం ఇచ్చిన ఈ ‘జీరో బెర్త్’ నిర్ణయం ఒక స్పష్టమైన హెచ్చరిక! వ్యక్తిగత ఎజెండాలు, గ్రూపు తగాదాలు పక్కనపెట్టి సమష్టిగా పనిచేయకపోతే ఎంతటి సీనియర్ నేతలైనా కనుమరుగైపోవాల్సిందేనన్న కఠిన సంకేతాన్ని అధిష్ఠానం పంపింది. మరి ఈ అవమాన భారంతోనైనా రాష్ట్ర నేతల్లో మార్పు వచ్చి అంతర్గత విబేధాలకు తెరపడుతుందా? లేక ఈ రగిలిన అసంతృప్తితో తెలంగాణ కాషాయ దళం (TBJP) మరింత అంతర్గత సంక్షోభంలోకి కూరుకుపోతుందా? కాలమే సమాధానం చెప్పాలి!

#TelanganaBJP #BJPReshuffle #BandiSanjay #DKAruna #KLaxman #NitinNabin #TelanganaPolitics #BJPInfighting #PoliticalEditorial #BJPNews #HyderabadPolitics

KTR-Pulivendula Barber
KTR: కేటీఆర్ పంచుకున్న ‘ప్రాణసంకట’ పొలిటికల్ కామెడీ!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment