NewsDabba

Vande Mataram: మొదటి రెండు చరణాలే ఎందుకు?

Vande Mataram: భారత స్వాతంత్ర్య సమరంలో కోట్ల గొంతుకలను ఏకం చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన మహోన్నత నినాదం ‘వందేమాతరం’. కానీ, స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా, అదే జాతీయ గేయం చుట్టూ రాజకీయ, మతపరమైన వివాదాలు ఇంకా వీడలేదు. తాజాగా దేశ రాజధాని వేదికగా మొదలైన రచ్చ, గోవా సభల మీదుగా పార్లమెంట్ దాకా పాకింది. కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరంలోని (Vande Mataram) తొలి రెండు చరణాలు మాత్రమే ఆలపిస్తామని స్పష్టం చేయగా, మొత్తం ఆరు చరణాలూ పాడాల్సిందేనని బీజేపీ తీవ్రస్థాయిలో పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో అసలు జాతీయ గేయంలో మిగిలిన నాలుగు చరణాల్లో ఏముంది? 1937లో కాంగ్రెస్ (Congress) తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి? దీని చుట్టూ జరుగుతున్న రాజకీయ, సామాజిక ఘర్షణల అసలు రూపురేఖలేమిటి?

జాతీయ గేయం వివాదం

ఇటీవల స్వాతంత్ర్య వేడుకలతో పాటు గోవాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమంలో వందేమాతరం ఆలపించిన తీరు తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగడంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) అత్యవసరంగా సమావేశమై ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలవిస్తామని స్పష్టం చేసింది. అయితే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో తీసుకువచ్చిన ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (సవరణ) చట్టం’ ద్వారా 1971 చట్టంలోని సెక్షన్ 3ని సవరించింది. దీనివల్ల జాతీయ గీతమైన ‘జనగణమన’కు ఉన్నట్టే వందేమాతరానికి కూడా సమాన చట్టపరమైన రక్షణ లభించింది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వందేమాతరం (Vande Mataram) పాడటాన్ని అడ్డుకున్నా, లేదా పాడే సభకు అంతరాయం కలిగించినా అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని ఈ చట్టం స్పష్టం చేస్తోంది.

PM Modi Saptdhara
Saptdhara: ‘సప్తధార’తో భారత్ రూపురేఖలు మారబోతున్నాయా?

Vande Mataram చారిత్రక పుట్టుక

ఈ గీతం వెనుక దాదాపు 150 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1875లో ప్రముఖ సాహిత్యవేత్త బంకించంద్ర ఛటోపాధ్యాయ సంస్కృతీకరించిన బెంగాలీ భాషలో ‘వందేమాతరం’ను రచించారు. ఆ తర్వాత ఆరేళ్లకు, అనగా 1881లో ఆయన ప్రసిద్ధ నవల ‘ఆనందమఠం’లో ఈ గీతాన్ని చేర్చారు. 18వ శతాబ్దం చివర్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు, స్థానిక ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా సన్యాసులు జరిపిన ‘సన్యాసి తిరుగుబాటు’ నేపథ్యంలో ఈ నవల రూపుదిద్దుకుంది. 1905 నుండి 1908 వరకు సాగిన స్వదేశీ ఉద్యమ కాలంలో వందేమాతరం దేశవ్యాప్తంగా ప్రధాన స్వాతంత్ర్య నినాదంగా మారిపోయింది. అయితే, ఆ కాలంలోనే ముస్లిం లీగ్ ఈ గీతంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘భారతమాతకు మొక్కుతున్నాను’ అనే భావన ఇస్లాం మౌలిక సిద్ధాంతమైన ‘దేవుడు ఒక్కడే’ అనే దానికి విరుద్ధమని, ఇది విగ్రహారాధన కిందకు వస్తుందని ఆనాడు ముస్లిం లీగ్ వాదించింది.

1937 నాటి CWC నిర్ణయం

ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో కాంగ్రెస్ పార్టీ (Congress) అంతర్గతంగా విస్తృత చర్చలు జరిపింది. సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు ఈ గీతాన్ని సంపూర్ణంగా సమర్థించగా, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తదితరులు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అభిప్రాయాన్ని కోరారు. దీనిపై స్పందిస్తూ ఠాగూర్ నెహ్రూకు ఒక చారిత్రక లేఖ రాశారు. ఆ లేఖలో, మొదటి భాగంలో ఉన్న భక్తి, మాతృభూమి సౌందర్య వర్ణన అద్భుతంగా ఉన్నాయని, మిగిలిన భాగాన్ని దీనితో ముడిపెట్టాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఆనందమఠం (Anandmath) నవలలోని సందర్భంతో కలిపి చదివితే అది ముస్లింల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని, కాబట్టి స్వచ్ఛందంగా మొదటి రెండు చరణాలను మాత్రమే జాతీయ గేయంగా (National Song) పరిగణించవచ్చని తేల్చిచెప్పారు.

దీని ఆధారంగా 1937 అక్టోబర్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధికారిక తీర్మానం చేసింది. మిగిలిన చరణాలు అంతగా ప్రాచుర్యంలో లేవని, పైగా ఇతర మత సమూహాల భావజాలానికి ఇవి విరుద్ధంగా ఉండే కొన్ని మతపరమైన అంశాలను కలిగి ఉన్నాయని CWC స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ సైతం 1939 జూలై 1న ‘హరిజన్’ పత్రికలో రాస్తూ.. “ఇది ఒక సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదం… కానీ, ఎక్కడైనా ఏ ముస్లిం లేదా ఇతర మతస్థుల మిశ్రమ సభల్లో వందేమాతరం పాడటానికి ఎవరైనా అభ్యంతరం చెబితే, ఎలాంటి గొడవలకు తావు ఇవ్వకుండా ఆ గానాన్ని విరమించుకోవాలి” అని హితవు పలికారు.

BJP lost in bypolls
BJP: బీజేపీ కోటలు కూల్చిన కారణాలు ఇవే!

మిగిలిన నాలుగు చరణాల్లో ఏముంది?

అసలు మిగిలిన నాలుగు చరణాలపై ఇంతటి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడానికి కారణం వాటిలోని భావజాలమే.
* మూడో చరణంలో మాతృభూమి రక్షణ కోసం కత్తులు పట్టే ‘కోట్లాది చేతుల’ ప్రస్తావన వస్తుంది.
* ఇక నాలుగో చరణంలో ప్రతి ఆలయంలోనూ కొలువైనది భరతమాత రూపమేనని కీర్తిస్తారు.
* ఐదో చరణంలో మాతృభూమిని హిందూ దేవతలైన దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవులతో ప్రత్యక్షంగా పోల్చారు.
ప్రసిద్ధ చరిత్రకారిణి తానికా సర్కార్ విశ్లేషణ ప్రకారం, ఆనందమఠం నవలలో ముస్లింలను ప్రత్యక్ష శత్రువులుగా చూపే యుద్ధ పిలుపుగా ఈ భాగాలు మారాయి. దేశాన్ని సాక్షాత్తు హిందూ దేవత రూపంలో కీర్తించడం వల్ల ఇతర మతస్తులలో, ముఖ్యంగా ముస్లింలలో పరాయీకరణ భావన పెరుగుతుందని వాదించారు. అల్లాను తప్ప మరెవరినీ పూజించని సిద్ధాంతానికి ఈ దేవతల ఆవాహన, విగ్రహారాధనా ఛాయలు తీవ్ర విరుద్ధమన్నది ముస్లిం పండితుల ప్రధాన అభ్యంతరం.

రాజ్యాంగ సభ నాటి ఘర్షణ

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, రాజ్యాంగ సభలో వందేమాతరం, జనగణమనలను జాతీయ గీతాలుగా ఎంపిక చేసే విషయంలో తీవ్ర చర్చలు జరిగాయి. 1947 ఆగస్టు 14న జరిగిన అధికార బదిలీ వేడుకలో సుచేతా కృపలానీ వందేమాతరం తొలి చరణాన్ని ఆలపించారు. అయితే ఆగస్టు 26న హెచ్.వి. కామత్ రాజ్యాంగ సభలో మాట్లాడుతూ.. ఆ పాట పాడే సమయంలో పలువురు ముస్లిం సభ్యులు ఉద్దేశపూర్వకంగా సభ వెలుపలే ఉండి, పాట ముగిశాక లోపలికి వచ్చారని ప్రస్తావించారు. నెహ్రూ మాత్రం వందేమాతరం ఆర్కెస్ట్రా వాయిద్యాలకు అనుగుణంగా సెట్ చేయడం కష్టమని భావించి ‘జనగణమన’ వైపు మొగ్గు చూపారు. 1948 నవంబర్ 5న సేథ్ గోవింద్ దాస్ దీనిని ఖండిస్తూ, నిపుణుల ద్వారా సంగీతం సమకూర్చవచ్చని వాదించారు.

చివరకు 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చారిత్రక ప్రకటన చేస్తూ.. ‘జనగణమన’ దేశ జాతీయ గీతంగా (National Anthem) ఉంటుందని, అదే సమయంలో స్వాతంత్ర్య పోరాటంలో చారిత్రక పాత్ర పోషించిన ‘వందేమాతరం’ దానికి సమాన హోదాతో జాతీయ గేయంగా (National Song) మన్ననలు పొందుతుందని అధికారికంగా ప్రకటించారు.

Gen Z Economic Inequality
Gen Z: జెన్ జీ పోరాడాల్సింది ఇలాంటి వాటి పైనే కదా?

Vande Mataram .. నేటి రాజకీయ రగడ

ఇటీవల కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక కార్యక్రమాల్లో మొత్తం ఆరు చరణాలనూ ఆలపించాలంటూ నూతన నిబంధనలను నోటిఫై చేయడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వందేమాతరాన్ని ముక్కలు చేసిందని బీజేపీ తీవ్రస్థాయిలో ఆరోపిస్తోంది. అయితే ఈ వాదనను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తీవ్రంగా ఖండించారు. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ కేవలం మొదటి రెండు చరణాలను మాత్రమే జాతీయ గేయంగా ఆమోదించిందని, 2025 డిసెంబర్‌లో పార్లమెంట్‌లో కేవలం చర్చ మాత్రమే జరిగిందని, పూర్తి వందేమాతరం పాడాలని ఎలాంటి పార్లమెంటరీ తీర్మానం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు ఆమోదం లేకుండా ప్రధాని, హోంమంత్రి ఏకపక్ష నోటిఫికేషన్ ద్వారా మొత్తం గీతాన్ని రుద్దుతున్నారని ఆయన విమర్శించారు.

1875లో ఒక సాహిత్య సృష్టిగా వెలువడి, 1905 నాటి స్వదేశీ ఉద్యమంలో వేలాది మంది ప్రాణత్యాగాలకు ప్రేరణగా నిలిచిన వందేమాతరం.. స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత కూడా భిన్న రాజకీయ సిద్ధాంతాల నడుమ నలిగిపోతూనే ఉంది. ఒకవైపు దేశ సమగ్రత, సాంస్కృతిక వారసత్వం పేరిట పూర్తి గీతం పాడాలనే పట్టుదల కొనసాగుతుంటే, మరోవైపు లౌకిక భావజాలం, రాజ్యాంగ సభ నాటి ఏకాభిప్రాయం పేరిట మొదటి రెండు చరణాలకే పరిమితం కావాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ వివాదం జాతీయతా భావానికి గీటురాయా లేక వర్తమాన రాజకీయ చదరంగంలో మరో వ్యూహమా అన్నది కాలమే నిర్ణయించాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment