NewsDabba

BJP: బీజేపీ కోటలు కూల్చిన కారణాలు ఇవే!

BJP: ఒకప్పుడు బీజేపీకి అత్యంత సురక్షితమైన కంచుకోటలు.. కమల దళానికి పెట్టని కోటలు! కానీ ఈరోజు ఆ కోటలు పునాదులతో సహా కదిలిపోయాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు.. కానీ సొంత ఓటు బ్యాంకే శత్రువులా మారి తిరగబడితే? అవును.. బిహార్‌లోని బంకీపూర్, మధ్యప్రదేశ్ లోని దతియా ఉప ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి మింగుడుపడని చేదు నిజాలను ముందర ఉంచాయి! కేవలం ఓటమి మాత్రమే కాదు.. తమ కరుడుగట్టిన అనుకూల వర్గాలే తమకు వ్యతిరేకంగా ఓటేశాయనే పచ్చి నిజం ఇప్పుడు బీజేపీని (BJP) నివ్వెరపోయేలా చేస్తోంది. పేపర్ లీక్‌ల మంటలు, అయోధ్య రామాలయ విరాళాల చుట్టూ తిరిగిన వివాదాలు, కుల సమీకరణాల ఘోర వైఫల్యం.. వీటన్నింటికీ మించి నాయకత్వ అహంకారం! అసలు ఈ ఉక్కు కోటల్లో ఏం జరిగింది? బీజేపీ వ్యూహాలు ఎక్కడ దెబ్బతిన్నాయి?

కంచుకోటల్లో ఘోర పరాజయం

మధ్యప్రదేశ్‌లోని దతియా, బిహార్‌లోని బంకీపూర్.. ఈ రెండూ ఒకప్పుడు బీజేపీకి ఎదురులేని నియోజకవర్గాలు. స్వయంగా జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ (Nitin Nabin) గతంలో ప్రాతినిధ్యం వహించి, రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన బంకీపూర్ స్థానాన్ని గెలవడం బీజేపీకి (BJP) అత్యంత ప్రతిష్టాత్మకం. కానీ ఫలితాలు వచ్చాక క్షేత్రస్థాయి పరిస్థితులు వేరేలా ఉన్నాయని తేలింది. ఈ ఓటమికి కారణం కేవలం ప్రచారం సరిగ్గా లేకపోవడం కాదు.. ప్రజలలో పేరుకుపోయిన తీవ్ర అసంతృప్తి, పేపర్ లీక్ ఆరోపణల నుంచి మొదలై అయోధ్య రామాలయ విరాళాల దొంగతనం వార్తల వరకు, స్థానిక నాయకత్వంలో ముదిరిన తీవ్ర అంతర్గత విబేధాలేనని స్వయంగా పార్టీ సీనియర్ నేతలే విమర్శనాత్మకంగా అంగీకరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: YS Jagan: అన్యాయానికి అండగా నిలబడడమే జగన్ రాజకీయామా?

Gen Z Economic Inequality
Gen Z: జెన్ జీ పోరాడాల్సింది ఇలాంటి వాటి పైనే కదా?

ప్రశాంత్ కిశోర్ దెబ్బ

బంకీపూర్ నియోజకవర్గంలో ఏకంగా 42 శాతానికి పైగా అగ్రవర్ణ ఓటర్లు ఉన్నారు. ఈ సాంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి బీజేపీ తన సర్వశక్తులూ ఒడ్డింది. కూటమి భాగస్వాములైన లోక్ జనశక్తి పార్టీ, జనతాదళ్ యునైటెడ్ నేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ, జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) వేసిన వ్యూహాత్మక పాచికల ముందు బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ నిలబడలేకపోయారు. ప్రశాంత్ కిశోర్ ఈ స్థానాన్ని ఏకపక్షంగా గెలుచుకోవడంతో బీజేపీకి చావుదెబ్బ తగిలింది. ఇక దతియాలో కాంగ్రెస్ అభ్యర్థి కుంవర్ ఘనశ్యామ్ సింగ్ తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవడంతో బీజేపీ వ్యూహాత్మక అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి.

సామాజిక వర్గాల చీలిక

2023కి ముందు దతియాలో (Datia) వరసగా మూడుసార్లు జయకేతనం ఎగురవేసిన బీజేపీకి (BJP) ఈ తీర్పు ఒక హెచ్చరిక. రవిశంకర్ ప్రసాద్, నితీన్ నబీన్, రామ్‌కృపాల్ యాదవ్ వంటి దిగ్గజ నేతలు పట్టున్న బ్లాకుల్లో కూడా బీజేపీ వెనుకబడిపోవడం గమనార్హం. పార్టీ నమ్ముకున్న ప్రతి కుల సమీకరణంలోనూ తీవ్ర చీలికలు వచ్చాయి. నితీష్ కుమార్‌ను సీఎం పీఠం నుంచి తప్పించి సామ్రాట్ చౌదరిని సీఎం చేయడంపై కుర్మీ సామాజిక వర్గంలో తీవ్ర తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. మరోవైపు యూజీసీ ఈక్విటీ నిబంధనల వివాదం అగ్రవర్ణాల ఆగ్రహానికి కారణమైంది. నిరుద్యోగం, ఇతర సమస్యలతో విసుగు చెందిన మహిళా ఓటర్లు కూడా పార్టీకి దూరమవ్వడం అతిపెద్ద దెబ్బగా మారింది.

విద్యార్థుల్లో అగ్గి రాజేసిన పేపర్ లీక్స్..

బంకీపూర్ (Bankipur) నియోజకవర్గం అనేక పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లకు కేంద్ర బిందువు. బిహార్ అంతటా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే లక్షలాది మంది విద్యార్థులు ఇక్కడే ఉంటారు. ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపిన NEET ప్రవేశ పరీక్ష అక్రమాలు, నిరంతరం జరుగుతున్న పేపర్ లీక్‌లు విద్యార్థులలో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చాయి. యువత తమ భవిష్యత్తు నాశనమవుతోందనే తీవ్ర ఆందోళనతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపిన తీరు ఈ ఎన్నికలపై స్పష్టమైన ప్రభావం చూపింది. నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలపై విద్యార్థులు చూపిన ఈ ఆగ్రహం బీజేపీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా మారింది.

ఇది కూడా చదవండి: Gen Z: జెన్ జీ పోరాడాల్సింది ఇలాంటి వాటి పైనే కదా?

Kerala Politics
Kerala Politics : కేరళ నేర్పుతున్న పొలిటికల్ పాఠాలేంటి?

అభ్యర్థుల ఎంపికలో తప్పులు.. నాయకత్వ అహంకారం

అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానం చేసిన తప్పులు పార్టీకి పెద్ద శాపంగా మారాయి. బ్యాంకీపూర్‌లో(Bankpur) మొదట అభిషేక్ కుమార్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటించారు. కానీ ఆయన కుటుంబానికి పశువుల మేత కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ప్రతిపక్షాలు దాడికి దిగడానికి ముందే అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది. దీనికి తోడు విజయం మనదేనన్న ధీమాతో కొందరు నేతలు చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు పట్టణ ఓటర్లను తీవ్రంగా గాయపరిచాయి. ఇటు దతియాలో (Datia) గతంలో మూడుసార్లు గెలిచిన నరోత్తమ్ మిశ్రాను పక్కనబెట్టడం వివాదాస్పదమైంది. అంతేకాకుండా, హత్యకు గురైన బీజేపీ నేత కల్లు కుష్వాహా భార్య.. నిందితులను సీఎం మోహన్ యాదవ్ కాపాడుతున్నారని బహిరంగంగా ఆరోపించడంతో, కుష్వాహా సామాజిక వర్గ ఓటర్లు ఏకపక్షంగా కాంగ్రెస్‌కు జై కొట్టారు.

ఆత్మపరిశీలన సమయం

ఈ ఊహించని ఓటమిపై బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామని తెలిపారు. మాంజల్పూర్ ప్రజలు చూపిన ఆదరణకు ధన్యవాదాలు తెలుపుతూనే, బంకీపూర్, దతియా ఫలితాలపై లోతైన అంతర్మథనం చేసుకుంటామని పేర్కొన్నారు. లోపాలను సరిదిద్దుకుని, కోల్పోయిన ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి కొత్త ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు.

ఏదేమైనా.. బంకీపూర్, దతియా ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి కేవలం ఒక సాదాసీదా ఓటమి మాత్రమే కాదు.. రాబోయే యూపీ, గుజరాత్, సార్వత్రిక ఎన్నికలకు ఒక తీవ్రమైన హెచ్చరిక! సొంత ఓటు బ్యాంకును నిర్లక్ష్యం చేయడం, యువత ఆక్రోశాన్ని అంచనా వేయకపోవడం, స్థానిక అంతర్గత పోరును చల్లార్చకపోవడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఈ తీర్పు నిరూపించింది. సీనియర్ నాయకత్వం ఇప్పటికైనా ఈ ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుని దిద్దుబాటు చర్యలు చేపడుతుందో లేక ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేసి మూల్యం చెల్లించుకుంటుందో చూడాలి!

#BJP #Bankipur #Datia #PrashantKishor #BiharPolitics #NEETProtests #NitinNabin #ElectionAnalysis #IndianPolitics #InvestigativeReport

Cancer Warrior Adrija Gan
Adrija Gan: చావుతో చదరంగం ఆడి గెలిచింది!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment