NewsDabba

Ravindra Bharathi: సంకుచితత్వపు సంకెళ్లలో రవీంద్ర భారతి!

Updated on: December 4, 2025 | By Editorial Team

కళకు కులం లేదు, గానానికి గమ్యం తప్ప గీతలు లేవు అని చెప్పుకునే దేశం మనది. కానీ, దురదృష్టవశాత్తు నేడు హైదరాబాద్ (hyderabad) నడిబొడ్డున ఉన్న రవీంద్ర భారతి (Ravindra Bharathi) సాక్షిగా జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి. దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balasubramanyam) విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై కొన్ని వర్గాల నుంచి వ్యక్తం అవుతున్న వ్యతిరేకత, దానికి కారణంగా వారు చూపుతున్న ప్రాంతీయ కారణాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ఒక కళాకారుడిని ఆయన పుట్టిన ప్రాంతాన్ని బట్టి కొలవాలా? లేక ఆయన అందించిన కళను బట్టి గౌరవించాలా? అన్న మౌలిక ప్రశ్న ఇప్పుడు సమాజం ముందు నిలిచింది.

ఎస్పీ బాలు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన రవీంద్ర భారతిలో ఆయన విగ్రహం వద్దన్నది వ్యతిరేకిస్తున్న వారి ప్రధాన వాదన. ఇది పైకి సబబుగానే అనిపించినా, లోతుగా ఆలోచిస్తే ఇందులో ఉన్న డొల్లతనం బయటపడుతుంది. ఈ వాదనను సమర్థించే వారు ముందుగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఒక్కటే.. అసలు ఆ భవనానికి ఉన్న పేరు ఎవరిది?

Freebies vs Welfare
Freebies: ఉచిత పథకాలకు కళ్లెం వేయాల్సిన సమయమిదే!

‘రవీంద్రనాథ్ ఠాగూర్’ (Rabindranath Tagore). ఆయనది తెలంగాణ కాదు, ఆంధ్రా కాదు, కనీసం దక్షిణాది కూడా కాదు. ఆయనది పశ్చిమ బెంగాల్. ఒక బెంగాలీ (Bengali) కవి పేరుతో ఉన్న భవనంలో, తెలుగు జాతి గర్వించదగ్గ గాయకుడి విగ్రహం పెట్టడానికి అభ్యంతరం ఎందుకు? విశ్వకవి రవీంద్రుడిని మనం గౌరవించుకుని నెత్తికెత్తుకున్నప్పుడు, మన భాషలోనే వేల పాటలు పాడి, మన సంస్కృతిని దశదిశలా వ్యాపించేలా చేసిన బాలును పరాయి వాడిగా ఎలా చూడగలం? ఒకవేళ ప్రాంతీయ వాదమే పరమావధి అయితే, ముందుగా రవీంద్ర భారతి పేరును మార్చి, ఏదైనా తెలంగాణ కవి పేరు పెట్టమని డిమాండ్ చేయాలి కదా? ఆ పని చేయకుండా, కేవలం బాలు విగ్రహాన్ని అడ్డుకోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాక మరేమిటి?

హైదరాబాద్ ఇప్పుడు కేవలం ఒక రాష్ట్ర రాజధాని కాదు. అది విశ్వనగరం. దేశ విదేశాల నుంచి పెట్టుబడులు, నిపుణులు వచ్చి స్థిరపడుతున్న కాస్మోపాలిటన్ సిటీ. ఇలాంటి నగరంలో కళాకారులను వారి పుట్టిన ఊరును బట్టి విభజించడం, వారి విగ్రహాలకు వీసాలు అడగడం మన బ్రాండ్ ఇమేజ్‌కే మాయని మచ్చ. మన హైదరాబాద్ గొప్పదనం ఇక్కడి ‘గంగా-జమునా తెహజీబ్’. ఇక్కడ ఘంటసాల గళం విప్పినా, బడే గులాం అలీ ఖాన్ రాగాలాపన చేసినా ప్రేక్షకులు తన్మయత్వంతో విన్నారు తప్ప, వారి ఆధార్ కార్డులను పరిశీలించలేదు. ఇప్పుడు ఆ సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరించడం అంటే, భవిష్యత్ తరాలకు సంకుచితత్వాన్ని వారసత్వంగా ఇవ్వడమే అవుతుంది.

Jogi Ramesh Family cheating exposed
Jogi Ramesh: ఆడబిడ్డ జీవితం నాశనం చేసిన ‘జోగి’ ఫ్యామిలీ!

బాలు గొంతులో పలికిన పాటలు కోట్లాది తెలుగు గుండెలను తాకాయి. అందులో తెలంగాణ పల్లె పాట ఉంది, రాయలసీమ జానపదం ఉంది, కోస్తా ఆకర్షణ ఉంది. ఆయన స్వరానికి ఎల్లలు లేనప్పుడు, ఆయన విగ్రహానికి మాత్రం ఎందుకు ఎల్లలు గీస్తున్నారు? ఈ విద్వేష పూరిత వాదనలు అంతిమంగా తెలుగు భాషకే నష్టం చేస్తాయి. ఇలాంటి అనవసర వివాదాల వల్ల కళాకారుల మధ్య, ప్రజల మధ్య అదృశ్య అగాధాలు ఏర్పడతాయి.

తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవం కోసం జరిగింది తప్ప, అన్య ప్రాంతపు కళాకారులను అవమానించడానికి కాదు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఎంతటి విశ్వజనీనమైన వ్యక్తో, సంగీత ప్రపంచంలో ఎస్పీ బాలు కూడా అంతే స్థాయి ఉన్న వ్యక్తి. ఠాగూర్ పేరు భవనానికి ఉన్నప్పుడు, బాలు విగ్రహం ఆవరణలో ఉండటం ఆ భవనానికి మరింత శోభను ఇస్తుంది తప్ప తగ్గించదు. ప్రభుత్వం, పౌర సమాజం ఈ విషయంలో మౌనం వీడాలి. సంకుచిత వాదనలను పక్కనపెట్టి, కళను కళగా ఆరాధించే మన హైదరాబాద్ గొప్పతనాన్ని కాపాడుకోవాలి. లేదంటే, చరిత్రలో మనం కళాపోషకులుగా కాకుండా, కళా విద్వేషకులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

TBJP
TBJP: తెలంగాణపై బీజేపీ ఆశలు వదిలేసుకుందా?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment