NewsDabba

Rupee : రూపాయి పతనం.. తెలుసుకోకపోతే మనకే నష్టం…!

Updated on: December 24, 2025 | By Editorial Team

Rupee: లేటెస్ట్‌ ట్రెండింగ్ న్యూస్ రూపాయి (Rupee) పతనం. డాలర్‌తో పోల్చితే రూపాయి (Rupee) విలువ 90రూపాయలకు పడిపోయిందన్నది వార్త. పడితే ఏంటి… పెరిగితే ఏంటి అని మాత్రం అనకండి. రూపాయి పడితే మనకు పెద్ద బొక్కే… రూపాయి ఎంత పడితే మన జేబుకు అంత పెద్ద చిల్లు పడుతుంది.

రూపాయి (Rupee) విలుప పడిపోయింది అనగానే మనకెందుకులే అనుకుంటాం. అదేదో మనకెవరికీ అర్థం కాని బ్రహ్మపదార్ధంలా ఫీలవుతుంటాం. ఆర్థికవేత్తలు చూసుకుంటారుగా అని ఆ వార్తను స్కిప్ చేస్తాం. కానీ రూపాయి పతనం కచ్చితంగా మనకు సంబంధించిన వార్తే. రూపాయితో మనకు జరిగే నష్టాలు మనం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

రూపాయి (Rupee) పడిపోతే మనపై నేరుగా పడే ఎఫెక్ట్‌ పెట్రోల్‌ ధరలకు రెక్కలు. మన దేశీయ చమురు అవసరాల్లో దాదాపు 85శాతం విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. ఇంతకుముందు కొంతకాలం రష్యా నుంచి కొనుగోలు చేశాం. అమెరికా ఆంక్షలతో ఇప్పుడు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు వాటికి డాలర్లలోనే చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా మనం ఎక్కువ మొత్తంలో క్రూడ్‌కు చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీలు ఎంతోకాలం ఆ భారాన్ని భరించలేవు. చివరకు అవి ఇండియాకు వాటిని వినియోగదారులపై మోపాల్సిందే. ఫలితంగా నేరుగా జేబుకు చిల్లు పడుతుంది. అంతేకాదు రవాణా ఛార్జీలు పెరుగుతాయి. ఫలితంగా నిత్యావసరాల ధరలకూ రెక్కలు వచ్చే అవకాశం ఉంది. వంట గ్యాస్‌ కూడా పెరిగే ప్రమాదముందని గుర్తుంచుకోండి.

Biswajit Mohanty
Biswajit Mohanty: 35 ఏళ్లకే కార్పొరేట్ కొలువుకు బైబై! ఎందుకు?

మనం విదేశాల నుంచి వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ బిల్లు భారం భారీగా పెరుగుతుంది. లీటర్‌కు నాలుగైదు రూపాయలు పెరుగుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఎరువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

మనం విదేశాల నుంచి ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం.. వాటికి డాలర్లలో చెల్లిస్తాం. ఇప్పుడు ఆ భారం పెరిగితే దాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. GST తగ్గడంతో వినియోగదారులకు దక్కాల్సిన ప్రయోజనాన్ని ఇప్పటికే పెరిగిన ధరలు తినేశాయి. విడిభాగాల ధరలు పెరగడంతో GST తగ్గించినా రేట్లు మాత్రం తగ్గలేదు. గత నాలుగు నెలల్లో మెమొరిచిప్స్ రేట్లు దాదాపు ఆరుశాతం పెరిగాయి. దీంతో టీవీ కంపెనీలు రేట్లు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. GST తర్వాత పెరిగిన డిమాండ్‌ రూపాయి పతనంతో తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు. హావెల్స్‌ LEDటీవీల ధరలను 3శాతం రేట్లు పెంచేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గోద్రేజ్‌ అప్లయెన్సెస్‌ తమ ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలను 5-7 శాతం పెంచేందుకు కసరత్తు చేస్టున్నట్లు చెబుతున్నారు.

భారత్‌లో బ్యూటీ ప్రొడక్ట్స్‌ విభాగం ఈ మధ్య వేగంగా విస్తరిస్తోంది. బాబీ బ్రౌన్, ఎంఏసీ, క్లీనిక్ అండ్‌ ది బాడీషాప్ వంటి బ్రాండ్లు వేగంగా జనంలోకి వెళుతున్నాయి. రూపాయి పతనంతో పెరుగుతున్న ధరలతో వాటికి ఛాలెంజెస్‌ తప్పేలా లేవు. ఇంపోర్టెడ్‌ కాస్మెటిక్స్‌, స్కిన్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

Gold
Gold: ప్రపంచాన్నే ఏలుతున్న కొత్త సూపర్ పవర్

కార్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇటీవల పెరిగిన అమ్మకాలు ఇప్పుడు రూపాయి విలువ పతనంతో తగ్గే అవకాశం ఉంది. ఆడి, బెంజ్‌లాంటి సంస్థలు పరిస్థితులను సమీక్షిస్తున్నాయి. కాంపొనెంట్స్‌ ధరల భారం పెరగడంతో టూవీలర్స్‌ రేట్లు కూడా జంప్ అవుతాయని అంచనా వేస్తున్నారు.

విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు ఏటా అదనంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఏడాది క్రితం లక్ష రూపాయలకు 1176 డాలర్లు వచ్చేవి. కానీ ఇప్పుడు 1110 డాలర్లు మాత్రమే వస్తున్నాయి. ఈ రకంగా వారిపై చాలా భారం పడుతుంది. అలాగే గతంలో విదేశీ విద్య కోసం డాలర్లలో లోన్లు తీసుకున్నవారు ఇప్పుడు రూపాయల్లో తిరిగి చెల్లించేటప్పుడు 12 నుంచి 13 శాతం అధికంగా చెల్లించాలి.

విదేశాలకు విహార యాత్రలకు వెళ్లే వారిపై ఎఫెక్ట్ పడుతుంది. వారు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మన దేశానికి వచ్చే వారికి మాత్రం ప్రయోజనం ఉంటుంది.

India America Trade Deal
TRADE DEAL : భారత్-అమెరికా ‘బిగ్ డీల్’.. అసలేం జరిగింది?

రూపాయి పతనంతో అందరికీ నష్టాలేనా అలాగని చెప్పలేం. విదేశీ ఎగుమతుల కంపెనీలకు లాభాలుంటాయి. సేవా రంగంలో ఉండే కంపెనీలు, ఐటీ కంపెనీలకు ఈ పరిణామాలు కలసి వచ్చేవే. వారికి ఎక్కువగా డాలర్ల రూపంలోనే నిధులు వస్తాయి. జౌళి, చేనేత వస్త్రాలు ఎగుమతి చేసేవారికి ప్రయోజనం ఉంటుంది. ఇక విదేశాల నుంచి రెమిటెన్స్ పెరుగుతాయి. అంటే విదేశాల్లో ఉండే NRIలు స్వదేశంలోని తమ వారికి పంపే డబ్బు. గత నెలలో వేయి డాలర్లు పంపితే 88వేలు వచ్చేవి. కానీ ఇప్పుడు 90వేలకు పైనే స్వదేశంలోని తమ ఫ్యామిలీకి అందుతుంది. అందుకే రూపాయి ధర తగ్గుతుండటంతో రెమిటెన్స్‌లు పెరిగాయి. యూఏఈ నుంచి ఒక్కసారిగా రెమిటెన్స్‌లు మూడు రెట్లు పెరగడానికి కారణం ఇదే.

ఇప్పట్లో రూపాయి కోలుకోవడం కాస్త కష్టమే. ఇంకా దిగజారితే 92రూపాయలకు చేరే ప్రమాదం ఉంది. ఈ ఏడాది చివరకు 91రూపాయలుగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎలా చూసినా ఇది మనకు ప్రతికూలమే. రూపాయి కోలుకోవాలంటే డాలర్‌ బలహీనపడాలి… అదే సమయంలో అమెరికాతో ట్రేడ్‌ డీల్‌ కుదరాలి. అప్పుడే రూపాయి క్షీణత ఆగిపోయి మళ్లీ పుంజుకునే అవకాశాలున్నాయి. విదేశీ సంస్థాగత మదుపుదారులు మన స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే పతనం ఆగుతుంది. ఒకవేళ వాళ్లు అమ్మకాలు కొనసాగిస్తే మాత్రం ఇబ్బందులే. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఏ మాత్రం పెరిగినా మన ఇంపోర్ట్‌ బిల్లు తడిసి మోపడవుతుంది. కాబట్టి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగకూడదని కోరుకోవాలి. ఒక వేళ రూపాయి పతనాన్ని ఆపేందుకు RBI కఠిన చర్యలు తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ నెమ్మదించొచ్చు. అప్పుడు పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయి. మొత్తంగా చూస్తే పరిస్థితులు ముందు నుయ్యి… వెనక గొయ్యిలా తయారయ్యాయి.

ఇంత చదివాక ఇప్పుడు చెప్పండి. రూపాయి విలువ పడిపోతే మనకు జరిగే నష్టమేంటో…!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment