Defected MLAs: రాజకీయాల్లో విశ్వసనీయత అనేది ఒక అలంకారప్రాయమైన పదం మాత్రమేనని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. 2023 డిసెంబర్ 7న అధికార పీఠాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, విపక్ష బీఆర్ఎస్ను నైతికంగా, రాజకీయంగా దెబ్బతీయడానికి ఆడిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ నాటకం ఇప్పుడు వికటించింది. ప్రజాతీర్పును, రాజ్యాంగ సూత్రాలను తుంగలో తొక్కి, బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకున్న కాంగ్రెస్ నాయకత్వం, నేడు వారికిచ్చిన హామీలను గాలికి వదిలేసి తీవ్ర నమ్మకద్రోహానికి ఒడిగట్టింది. “నియోజకవర్గాలకు నిధుల వరద పారిస్తాం, పెండింగ్ సమస్యలన్నింటినీ చిటికెలో పరిష్కరిస్తాం” అంటూ గులాబీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పెద్దలు అల్లిన మాయాజాలం క్రమంగా చెదిరిపోతోంది. అధికార పార్టీ ఇస్తామన్న స్వర్గాన్ని చూసి వెళ్లిన ఆ ఎమ్మెల్యేలు (Defected MLAs), ఇప్పుడు సొంత నియోజకవర్గాల్లో ప్రజల ముందు నిలబడలేక, పార్టీలో సరైన గుర్తింపు దక్కక తీరని వేదనతో నలిగిపోతున్నారు.
నిధుల మాట దేవుడెరుగు, నిలదీతలే!
పార్టీ మారిన ఎమ్మెల్యేల (Defected MLAs) ఆవేదన, వారిలో రగిలిపోతున్న అసంతృప్తి దాచాలన్నా దాగని విధంగా బహిర్గతమవుతోంది. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivasa Reddy) బహిరంగంగా చేసిన తీవ్ర వ్యాఖ్యలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. కామారెడ్డి జిల్లా బీర్కూరులో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పోచారం వ్యక్తం చేసిన ఆక్రోశం, కాంగ్రెస్ పాలనలోని అంతర్గత వైఫల్యాలను, అస్తవ్యస్త పరిస్థితులను దిగంబరంగా ఆవిష్కరించింది. “తాను మంత్రి పదవి కోసమో, డబ్బు కోసమో కాంగ్రెస్లో చేరలేదు.. ఆరు నెలల్లో బాన్సువాడ నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్వయంగా ఇచ్చిన హామీని నమ్మి వచ్చాను” అని పోచారం పేర్కొనడం ద్వారా రేవంత్ ప్రభుత్వం విశ్వసనీయతను తీవ్రంగా ప్రశ్నించారు. సమయం దాటిపోతున్నా పనులు ముందుకు సాగకపోగా, కనీసం ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను కూడా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడం కాంగ్రెస్లో సాగుతున్న నీడల యుద్దాన్ని తేటతెల్లం చేస్తోంది.
కనీస మర్యాద లేని పాలన..!
ఒక మాజీ స్పీకర్, సీనియర్ నాయకుడికే కాంగ్రెస్ ప్రభుత్వంలో దక్కుతున్న గౌరవం ఏపాటిదో పోచారం వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy), చివరికి ముఖ్యమంత్రి కార్యాలయంలో చక్రం తిప్పుతున్న మాజీ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డికి (Vem Narendar Reddy) ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని పోచారం బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రే చెప్పినా సచివాలయంలో పనులు జరగకపోవడం, మంత్రులు ఆయన ఆదేశాలను కూడా బేఖాతరు చేయడం ఏ రకమైన పరిపాలనకు సంకేతం? కేవలం కేసీఆర్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ (BRS) బలాన్ని తగ్గించడానికే ఈ ఎమ్మెల్యేలను వాడుకుని, ఆ తర్వాత కనీస మర్యాద కూడా ఇవ్వకుండా పక్కన పడేయడం కాంగ్రెస్ (Congress) క్రూరమైన రాజకీయ వ్యూహాన్ని బయటపెట్టింది. రాజకీయం అంటే కేవలం హామీలు గుప్పించడం, అధికారాన్ని చెలాయించడం మాత్రమే కాదని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే నాయకత్వ లక్షణమని రేవంత్ సర్కార్ మరిచిపోయింది.
Defected MLAs : పెల్లుబుకుతున్న అసంతృప్తి!
ఈ ఆవేదన ఒక్క బాన్సువాడకే పరిమితం కాలేదు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ప్రస్తుతం ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా మారింది.
ఖైరతాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కీలకమైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagendar), కాంగ్రెస్లో సరైన ప్రాధాన్యత దక్కక, తీవ్ర అసంతృప్తితో ఊగిసలాడుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనను, ఆయన దూరదృష్టిని దానం బహిరంగంగానే పొగడ్తలతో ముంచెత్తడం, ఆయన కాంగ్రెస్ వైఖరి పట్ల ఎంత విసిగిపోయారో తెలియజేస్తోంది.
పటాన్చెరు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) గత కొంతకాలంగా కాంగ్రెస్ (Congress)కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా, మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆయన సోదరుడు బీఆర్ఎస్ (BRS) కండువా కప్పుకుని, పార్టీ అభ్యర్థుల విజయం కోసం పని చేయడం, పటాన్చెరులో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించడం గూడెం రాజకీయ వైఖరిని స్పష్టంగా ఆవిష్కరిస్తోంది.
జగిత్యాల: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ (Dr Sanjay Kumar) పార్టీ మారి రెండేళ్లు దాటుతున్నా నియోజకవర్గంలో కీలకమైన రహదారి పనులకు నిధులు విడుదల కాలేదు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఆయన స్థానిక ప్రజలు, అనుచరుల నుంచి తీవ్ర నిలదీతలను ఎదుర్కొంటున్నారు.
గద్వాల: ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి (Krishnamohan Reddy) పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నియోజకవర్గానికి జీవనాడి అయిన గుర్రం లిఫ్ట్ పథకం పనులు, రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు పనులకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండటంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు.
ఇది కూడా చదవండి: Kids Mental Health: పిల్లల మనస్సులతో ఆట.. మెటాకు రూ.8,967 కోట్ల జరిమానా!
పాత-కొత్త విభేదాల ‘కాంగ్రెస్’ కుంపటి
అధికారంలోకి వచ్చామన్న అహంకారంతో కాంగ్రెస్ (Congress) అధినాయకత్వం ప్రవర్తిస్తున్న తీరు, పార్టీలోని పాత నాయకులు, బీఆర్ఎస్ (BRS) నుంచి వచ్చిన కొత్త ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైన ఖాళీని సృష్టించింది. ఒకవైపు సంక్షేమ పథకాల అమలుకు నిధులు లేక సతమతమవుతున్న ప్రభుత్వం, మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇచ్చిన అభివృద్ది హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసింది. పీసీసీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ “ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి” అని చెబుతున్న మాటలు, కాంగ్రెస్ ప్రభుత్వ దివాలా కోరు రాజకీయాలకు, ఆర్థిక నిర్వహణా రాహిత్యానికి నిదర్శనం. ఆర్థిక పరిస్థితి బాగులేనప్పుడు నియోజకవర్గాలను సవర్ణిస్తామని ఫిరాయింపుదారులకు గుప్పించిన హామీలు కేవలం ఓట్ల కోసమేనా?
‘ఘర్ వాపసీ’ దిశగా అడుగులు..?
కష్టకాలంలో పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు (Defected MLAs), ఇప్పుడు అక్కడ పడుతున్న అవమానాలు భరించలేక తిరిగి సొంత గూటి వైపు చూస్తుండటం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి తెరలేపింది. బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లతో పలువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పటికే రహస్య సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం నిజమేనని వారి ఆవేదన నిరూపిస్తోంది. తమ రాజకీయ భవిష్యత్తును, నియోజకవర్గ ప్రయోజనాలను బలిపెట్టిన కాంగ్రెస్ (Congress) తీరుపై విసిగిపోయిన ఈ నేతలు, తిరిగి ‘గులాబీ’ గూటికి చేరితే రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వానికి రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం. కాంగ్రెస్ నిరంకుశ, మోసపూరిత వైఖరిపై విసిగిపోయిన ఎమ్మెల్యేల ఈ ఆవేదన జ్వాలలు, రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాన్ని ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాల్సిందే.