TTD Ghee: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ (TTD Ghee) వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే సిబిఐ (CBI) దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ (Dinesh Kumar Rtd. IAS) నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించడం రాజకీయంగా, పరిపాలనాపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సీబీఐ (CBI) విచారణ తర్వాత మళ్లీ ఈ కమిటీ ఎందుకు? దీని వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి? అనే అంశాలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన నెయ్యి కల్తీ (Adulterated Ghee) వ్యవహారంలో దోషులెవరు? కేవలం కాంట్రాక్ట్ సంస్థలు, కింది స్థాయి ఉద్యోగులేనా? లేక నిర్ణయాత్మక స్థానాల్లో ఉండి నిబంధనలు మార్చిన పెద్దలు కూడా ఉన్నారా? ఈ ప్రశ్నలే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వేసిన కొత్త కమిటీకి ప్రాతిపదికగా మారాయి.
ఇది కూడా చదవండి: YCP vs TDP: వైసీపీ దబాయింపు.. టీడీపీ సెల్ఫ్ గోల్!
CBI ఛార్జ్ షీట్: పాత్రధారులకే పరిమితమా?
సీబీఐ తన దర్యాప్తును ముగించి నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే, ఈ ఛార్జ్ షీట్ పరిశీలిస్తే, అందులో ప్రధానంగా టిటిడిలోని (TTD) జనరల్ మేనేజర్ స్థాయి ఉద్యోగులు, నెయ్యి నాణ్యతను పరీక్షించాల్సిన ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్ (బయటి నిపుణులు) పేర్లు మాత్రమే ఉన్నాయి. కానీ, ఈ కల్తీ వెనుక ఉన్న అసలైన సూత్రధారులను సీబీఐ వదిలేసిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టిటిడి బోర్డు చైర్మన్, బోర్డు సభ్యులు, కీలకమైన పర్చేజింగ్ కమిటీ పాత్రపై సీబీఐ మౌనం వహించింది. ఈ లోటును భర్తీ చేయడమే దినేష్ కుమార్ కమిటీ ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
ఛార్జ్ షీట్తో పాటు సీబీఐ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ‘సెల్ఫ్ కంటైన్డ్ నోట్’ను అందజేసింది. ఇది అత్యంత కీలకమైన పత్రం. ఇందులో సీబీఐ కొన్ని పక్కా ఆధారాలను (Fact-Finding Information) పొందుపరిచింది.
టిటిడి బోర్డు సభ్యులు, కొనుగోలు కమిటీ సభ్యుల పాత్రను ప్రభుత్వం పరిశీలించాలని కోరింది. పరిపాలనాపరంగా (Administrative), శాఖాపరంగా (Departmental), పాలనాపరంగా (Governance) తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. టెండర్ నిబంధనలను సడలించడంలో (Relaxing Tender Conditions) పర్చేజ్ కమిటీ సభ్యుల వైఫల్యాలను ఎత్తిచూపింది.
దినేష్ కుమార్ కమిటీ బాధ్యతలు ఏమిటి?
ప్రభుత్వం నియమించిన ఈ ఏకసభ్య కమిటీ కేవలం క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కోసం కాదు. ఇది పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్, గవర్నెన్స్ అంశాలపై దృష్టి సారిస్తుంది. అప్పటి టిటిడి (TTD) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పర్చేజింగ్ కమిటీ మెంబర్లుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల పాత్రను ఈ కమిటీ విశ్లేషిస్తుంది. టెండర్ నిబంధనలను ఎవరి కోసం మార్చారు? కల్తీ నెయ్యి సరఫరా చేసే సంస్థలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. అప్పటి ఈఓలు (Executive Officers), ఇతర సీనియర్ అధికారుల వైఫల్యాలను కూడా కమిటీ నిర్ధారిస్తుంది.
ఇది రాజకీయ కక్షసాధింపా?
సాధారణంగా ఇలాంటి కమిటీలు వేసినప్పుడు రాజకీయ విమర్శలు రావడం సహజం. అందుకే, ప్రభుత్వం జీవోలో స్పష్టంగా ఈ కమిటీ పరిధిని “అడ్మినిస్ట్రేటివ్ అండ్ గవర్నెన్స్ ఆస్పెక్ట్స్”కే పరిమితం చేసింది. తద్వారా ఇది రాజకీయ కక్షతో వేసిన కమిటీ అని కోర్టుల్లో సవాల్ చేసే అవకాశం లేకుండా జాగ్రత్త పడింది. సీబీఐ (CBI) ఇచ్చిన నోట్ ఆధారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది.
ఇది కూడా చదవండి: Tirumala Ghee : దైవం సాక్షిగా దగా.. భక్తుల మనోభావాలతో జూదం!
45 రోజుల గడువు – తేలనున్న భవితవ్యం
దినేష్ కుమార్ (Dinesh Kumar) కమిటీకి తన నివేదికను సమర్పించడానికి 45 రోజుల గడువు ఇచ్చారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ‘రికమెండేటరీ’ స్వభావం కలిగి ఉంటుంది. అంటే, కమిటీ తప్పులను నిర్ధారిస్తే, ప్రభుత్వం వారిపై క్రిమినల్ కేసులు పెట్టడమో లేదా ఇతర కఠిన చర్యలు తీసుకోవడమో చేస్తుంది.
టిటిడి (TTD) వంటి పవిత్ర సంస్థలో నిర్ణయాలు తీసుకునే పెద్దలు తమ బాధ్యతను విస్మరించినప్పుడు, కేవలం కింది స్థాయి ఉద్యోగులను శిక్షించడం వల్ల న్యాయం జరగదు. అందుకే, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తుల ప్రమేయంపై ఆధారాలను సేకరించి, వారిని బాధ్యులుగా చేయడమే ఈ వన్ మ్యాన్ కమిటీ అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ కేసులో దినేష్ కుమార్ కమిటీ నివేదిక అత్యంత కీలకం కానుంది.
















