YCP vs TDP: తిరుమల కొండల మీద వెలసిన వేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం అంటే కోట్లాది మంది భక్తులకు అది కేవలం తినుబండారం కాదు, ఒక పవిత్రమైన నమ్మకం. అటువంటి ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ (Adulterated Ghee) అయిందనే వార్త తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. సహజంగానే, ఏ ప్రభుత్వ హయాంలో అయితే ఈ అపచారం జరిగిందో ఆ పార్టీ (YCP) తీవ్రమైన ఆత్మరక్షణలో పడాలి. ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాలి. కానీ, చిత్రంగా ఈ సీన్ రివర్స్ అయింది. తప్పు చేసిన వారు దబాయిస్తూ అఫెన్స్లోకి వెళ్లగా, తప్పును ఎత్తిచూపిన అధికార పక్షం (TDP) వివరణ ఇచ్చుకుంటూ డిఫెన్స్లో పడిపోయింది. ఈ విచిత్ర పరిస్థితి వెనుక ఉన్న రాజకీయ చదరంగం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
జంతు కొవ్వు – ఒక వ్యూహాత్మక తప్పిదం
ముఖ్యమంత్రి చంద్రబాబు లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు (Animal Fat) కలిసిందని ప్రకటించినప్పుడు, అది ఒక సంచలనం. అయితే, ఈ ప్రకటనలో ఆయన వాడిన పదజాలం వైసీపీకి (YCP) ఒక బలమైన ఆయుధాన్ని అందించింది. ల్యాబ్ రిపోర్టుల్లో ‘ఫారిన్ ఫ్యాట్’ (అంటే నెయ్యి కాని ఇతర కొవ్వులు) ఉన్నట్లు తేలినా, అది ఖచ్చితంగా పంది కొవ్వో లేదా గొడ్డు కొవ్వో అని నిర్ధారించే క్రమంలో ఉన్న సాంకేతిక సందిగ్ధతను వైసీపీ (YCP) తెలివిగా వాడుకుంది. సీబీఐ (CBI)పర్యవేక్షణలోని సిట్ దర్యాప్తులో బాబు చెప్పిన స్థాయిలో జంతు కొవ్వు ఆనవాళ్లు లేవనే సంకేతాలు రాగానే, వైసీపీ తన స్వరాన్ని పెంచింది.
ఇది కూడా చదవండి : Kova Bun: కోవా బన్ ‘వలీ’ ఎపిసోడ్ – యూట్యూబ్ ఉన్మాదంపై ధర్మయుద్ధం
ఇక్కడ అసలు విషయం మరుగున పడిపోయింది. సరఫరా అయింది అసలు నెయ్యే కాదని, అది కేవలం కెమికల్ ఆయిల్ మిశ్రమమని ఆధారాలు ఉన్నప్పటికీ.. చర్చ మొత్తం “జంతు కొవ్వు ఉందా? లేదా?” అనే పాయింట్ చుట్టూ తిరిగేలా వైసీపీ (YCP) చేయగలిగింది. ఒక అబద్ధాన్ని పట్టుకుని చంద్రబాబు భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారనే నెరేటివ్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో వైసీపీ సక్సెస్ అయింది. తద్వారా, తాము చేసిన ‘కల్తీ నెయ్యి సరఫరా’ (Adulterated Ghee) అనే అసలు నేరాన్ని ఆ గందరగోళంలో దాచిపెట్టగలిగారు.
Heritage అస్త్రం – TDPని బెంబేలెత్తించిన వ్యూహం
వైసీపీ ఈ పోరాటంలో వాడిన మరో ప్రధాన అస్త్రం ‘హెరిటేజ్’. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీకి, చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ (Heritage) సంస్థకు వ్యాపార సంబంధాలు ఉన్నాయంటూ వైసీపీ చేసిన ప్రచారం టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేసింది. నిజానికి ఈ ఆరోపణల్లో ఎంత నిజం ఉందనేది పక్కన పెడితే, వైసీపీ చేసిన హడావుడికి హెరిటేజ్ సంస్థ వెంటనే కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవాల్సి వచ్చింది.
చట్టపరంగా ఇది సరైన చర్యే అయినప్పటికీ, రాజకీయంగా మాత్రం ఇది టీడీపీ (TDP) బలహీనతగా కనిపించింది. ఒకవైపు వైసీపీ నేతలు మైకుల ముందు దబాయిస్తూ మాట్లాడుతుంటే, మరోవైపు టీడీపీ నేతలు ఈ హెరిటేజ్ (Heritage) లింకుపై స్పందించేందుకు వెనకడుగు వేశారు. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు అనే సామాన్య ప్రశ్నను వైసీపీ ప్రజల్లోకి వదిలి, టీడీపీని డిఫెన్సివ్ మోడ్లోకి నెట్టేసింది. ఆరోపణలు చేసిన వారే ఇప్పుడు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన దుస్థితిని కల్పించడంలో జగన్ సేన వ్యూహం ఫలించింది.
కెమికల్ ఆయిల్ నెయ్యిగా ఎలా మారింది?
వైసీపీ హయాంలో నియమ నిబంధనలను తుంగలో తొక్కి, అత్యంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసే సంస్థలకు కాంట్రాక్టులు ఇవ్వడం వెనుక ఉన్న లాలూచీ పక్కాగా కనిపిస్తోంది. మార్కెట్ ధర కంటే తక్కువకు నెయ్యి ఇస్తామన్న కంపెనీలు, నెయ్యికి బదులు విషపూరితమైన ఆయిల్స్ సరఫరా చేశాయి. ఈ పాయింట్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, వైసీపీని రాజకీయంగా కట్టడి చేయాల్సిన టీడీపీ.. కేవలం “జంతు కొవ్వు” అనే పాయింట్కు స్టిక్ అయిపోయి సెల్ఫ్ గోల్ చేసుకుంది.
ఇది కూడా చదవండి: Tirumala Ghee : దైవం సాక్షిగా దగా.. భక్తుల మనోభావాలతో జూదం!
వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి, “మేము తప్పు చేస్తే సాక్ష్యాలు చూపండి, సీబీఐ రిపోర్టులో ఎక్కడ ఉంది?” అని ఎదురుదాడి చేస్తుంటే, అధికారంలో ఉన్న టీడీపీ సమాధానం చెప్పలేక నీళ్లు నమలడం విడ్డూరంగా అనిపిస్తుంది. వైసీపీ తన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి ఎంతటి ఆవేశంతో పోరాడుతోందో, ఆ స్థాయిలో టీడీపీ నిజాలను నిరూపించడానికి దూకుడు (YCP vs TDP) ప్రదర్శించలేకపోయింది.
YCP రాజకీయ గెలుపు – నైతిక ఓటమి
ప్రస్తుతానికి ఈ వ్యవహారంలో వైసీపీ అఫెన్స్లో (YCP vs TDP) ఉండి రాజకీయంగా పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. తమపై వచ్చిన తీవ్రమైన మచ్చను, ప్రత్యర్థి పార్టీ చేసిన చిన్న చిన్న సాంకేతిక పొరపాట్ల ద్వారా చెరిపేసుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ, కోట్లాది మంది భక్తుల దృష్టిలో తిరుమల పవిత్రతకు భంగం కలిగించిన పాపం మాత్రం అలాగే ఉండిపోతుంది.
టీడీపీ ఇప్పటికైనా తన డిఫెన్స్ మోడ్ను (YCP vs TDP) వీడి, అసలు నెయ్యి కల్తీ ఎలా జరిగింది? ఎవరు ఎవరికి కాంట్రాక్టులు ఇచ్చారు? ఆ కెమికల్ ఆయిల్ మిశ్రమం ప్రసాదంలోకి ఎలా వచ్చింది? అనే పచ్చి నిజాలను ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టాలి. లేదంటే, అపరాధి స్థానంలో ఉండాల్సిన వారు అజేయుల్లా చెలామణి అయ్యే ప్రమాదం ఉంది. రాజకీయ చదరంగంలో ఎత్తులు, పైఎత్తులు సహజమే కానీ, దేవుడి ప్రసాదం విషయంలో జరిగిన అన్యాయం మాత్రం రాజకీయాల కంటే అతీతమైనది. ఆ నిజాన్ని నిరూపించడమే ఇప్పుడు అధికార పక్షం ముందున్న అసలైన సవాల్.
















