Justice Swaminathan: తమిళనాడులో (Tamilnadu) ప్రజాస్వామ్యం ఉందా? లేక హిట్లర్ పాలన నడుస్తోందా? ఒక ఆలయం ముందు భక్తులు దీపం వెలిగించుకుంటామంటే అది శాంతిభద్రతల సమస్య ఎలా అవుతుంది? భక్తుల హక్కులను కాపాడండని తీర్పు చెప్పినందుకు.. ఏకంగా ఒక హైకోర్టు న్యాయమూర్తిపైనే ‘అభిశంసన’ (Impeachment) కత్తిని వేలాడదీయడం డీఎంకే (DMK) ప్రభుత్వ అహంకారానికి పరాకాష్ట. రాజ్యాంగం గురించి గొప్పలు చెప్పే కాంగ్రెస్ (Congress), వ్యక్తి స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలిచ్చే కమ్యూనిస్టులు.. ఈ అరాచకానికి వంతపాడటం సిగ్గుచేటు. న్యాయవ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్న ఈ రాజకీయ పార్టీల కుట్రలను బట్టబయలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
భక్తుల మనోభావాలంటే అంత చులకనా?
మధురైకి సమీపంలోని ప్రసిద్ధ తిరుపరంకుండ్రం (Tiruparamkundram) సుబ్రమణ్యస్వామి ఆలయం (Subramanya Swamy Temple) వద్ద ఒక దీపస్తంభం ఉంది. అక్కడ దీపం వెలిగించుకోవడం హిందువుల సెంటిమెంట్. కానీ, ట్రాఫిక్ పేరుతో, శాంతిభద్రతల సాకుతో పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. దీనిపై మద్రాస్ హైకోర్టు (Madras High Court) మధురై బెంచ్ (Madhurai Bench) న్యాయమూర్తి జస్టిస్ జి.ఆర్.స్వామినాథన్ (Justice G R Swaminathan) చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. “మతపరమైన ఆచారాలు పాటించడం ప్రాథమిక హక్కు, దీపం వెలిగిస్తే వచ్చే నష్టమేమిటి?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది భక్తులకు దక్కిన విజయం. కానీ, డీఎంకే ప్రభుత్వానికి మాత్రం ఇది కంటగింపుగా మారింది. హిందూ ఆలయాల ఆచారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, కోర్టు చివాట్లు పెట్టినా తమ పంతం నెగ్గించుకోవాలనుకోవడం వారి వక్రబుద్ధిని సూచిస్తోంది.
ఇదేనా ద్రవిడ మోడల్?
జస్టిస్ స్వామినాథన్ (Justice Swaminathan) ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయలేదు. సరే, డివిజన్ బెంచ్ ఆదేశించింది.. దాన్నీ బుట్టదాఖలు చేశారు. కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామంటే.. దాన్ని కూడా లెక్కచేయలేదు. అంటే, తమిళనాడులో రాజ్యాంగం కంటే డీఎంకే పార్టీ నిబంధనలే ఎక్కువని స్టాలిన్ ప్రభుత్వం భావిస్తోందా? చట్టాన్ని, న్యాయస్థానాలను గౌరవించని ప్రభుత్వం ప్రజలను ఏం రక్షిస్తుంది? తమకు నచ్చని తీర్పు వస్తే, దాన్ని అమలు చేయకపోవడమే కాకుండా, తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిని వేధించడం రౌడీ రాజకీయాలకు నిదర్శనం.
రాజ్యాంగ పరిరక్షకులా? రాజ్యాంగ భక్షకులా?
ఇక్కడ అసలైన విచిత్రం కాంగ్రెస్, వామపక్షాల వైఖరి. రాహుల్ గాంధీ ఢిల్లీలో రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని “రాజ్యాంగం ప్రమాదంలో ఉంది” అని గొంతు చించుకుంటారు. కానీ, తమిళనాడులో మాత్రం, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన న్యాయమూర్తి గొంతు నొక్కేందుకు డీఎంకేతో చేతులు కలుపుతారు. జస్టిస్ స్వామినాథన్పై అభిశంసన నోటీసు ఇవ్వడానికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే ఎంపీలు సంతకాలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. న్యాయమూర్తులను బెదిరించడమేనా కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ? ఇదేనా మీ భావప్రకటనా స్వేచ్ఛ? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే యూట్యూబర్లను అరెస్టు చేసినప్పుడు నోరుమెదపని వామపక్షాలు, ఇప్పుడు న్యాయమూర్తిపై వేటు వేయడానికి ఎలా సంతకాలు చేస్తారు?
జడ్జిలను భయపెట్టే కుట్ర
జస్టిస్ స్వామినాథన్ గతంలోనూ ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టారు. భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ కోపాన్నంతా మనసులో పెట్టుకుని, ఇప్పుడు దీపం సాకుతో ఆయనపై పగ తీర్చుకుంటున్నారు. అభిశంసన నోటీసు ఇవ్వడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.. “ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిస్తే మీకూ ఇదే గతి పడుతుంది” అని మిగిలిన న్యాయమూర్తులను భయపెట్టడమే. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతపై జరుగుతున్న సర్జికల్ స్ట్రైక్.
సూడో సెక్యులరిజం ముసుగు తొలగింది!
ఒకవేళ ఇదే తీర్పు మరేదైనా మతానికి అనుకూలంగా వచ్చి ఉంటే, ఈ పార్టీలు ఇలాగే స్పందించేవా? ఖచ్చితంగా కాదు. అప్పుడు “మైనారిటీ హక్కుల రక్షణ” అని భజన చేసేవారు. కానీ, హిందూ భక్తుల హక్కుల ప్రస్తావన వచ్చేసరికి, వీరి కళ్ళకు ‘మతతత్వం’ కనిపిస్తోంది. హిందూ ధర్మానికి అనుకూలంగా ఎవరు మాట్లాడినా, అది న్యాయమూర్తి అయినా సరే, వారిని సంఘీలుగా ముద్రవేసి వేధించడం ఈ కూటమికి అలవాటుగా మారింది. ఇది పక్కా రాజకీయ కక్షసాధింపు చర్యే తప్ప, ఇందులో ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదు.
న్యాయమూర్తి కేవలం ఒక అధికారి కాదు, న్యాయానికి ప్రతిరూపం. ఆయన తీర్పు నచ్చకపోతే పై కోర్టుకు వెళ్లాలి కానీ, ఇలా పార్లమెంటులో తీర్మానాలు పెట్టి బెదిరించడం పిరికిపందల చర్య. డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాల కూటమి చేస్తున్న ఈ దుశ్చర్యను ప్రజలు గమనిస్తున్నారు. న్యాయవ్యవస్థపై రాజకీయ పెత్తనాన్ని అనుమతిస్తే, రేపు సామాన్యుడికి న్యాయం జరిగే దారే ఉండదు. ఈ అభిశంసన డ్రామాను అడ్డుకోకపోతే, ప్రజాస్వామ్యానికి అది చీకటి రోజు అవుతుంది.

A Passionate Telugu Writer Covering Politics, Public Voice, And Current Affairs With Clarity And Insight. Dedicated To Presenting Unbiased Perspectives Rooted In Truth And Regional Relevance. Believes In Giving A Voice To The People Through Powerful Storytelling And Factual Reporting.
















A.R.Rahman : రెహమాన్ మనసులో ఇంత విషముందా?