Satyam : భారతీయ కార్పొరేట్ చరిత్రలో అదొక చీకటి రోజు. 2009 జనవరి 7. అంతవరకూ ఐటీ రంగంలో ఆణిముత్యంగా వెలిగిన ‘సత్యం కంప్యూటర్స్’ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ కంపెనీ అధినేత బి.రామలింగరాజు రాసిన ఒక్క లేఖ.. దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. వేల కోట్ల రూపాయల కుంభకోణం బయటపడింది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ స్కాం వెనుక ఉన్న కారణాలేంటి? ఆయనే ఎందుకు బయటకొచ్చి చెప్పాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఐదేళ్ల నిరీక్షణ తర్వాత నెట్ఫ్లిక్స్లో ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ (Bad Boy Billionairs) సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. దాదాపు ఐదేళ్ల న్యాయపోరాటం తర్వాత, ఎట్టకేలకు రామలింగరాజు ఎపిసోడ్ వీక్షకుల ముందుకు వచ్చింది. ఈ డాక్యుమెంటరీ సిరీస్ చూసిన తర్వాత.. రామలింగరాజును ఒక నేరస్తుడిగా కంటే, పరిస్థితుల ప్రభావంతో తప్పు చేసిన ఒక దార్శనికుడిగా చూసే వారి సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. అసలు ఈ ఎపిసోడ్ ఏం చెప్పింది? సత్యం స్కాంలో (Satyam Scam) దాగి ఉన్న సత్యాలేంటి?
ఐదేళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు తెరపైకి ‘సత్యం’ (Satyam)
నెట్ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ సిరీస్ విడుదలైనప్పుడు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, సుబ్రతా రాయ్ సహారా వంటి వారి ఎపిసోడ్లు సంచలనం సృష్టించాయి. కానీ, సత్యం రామలింగరాజు ఎపిసోడ్ మాత్రం న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకుంది. దాదాపు ఐదేళ్ల పాటు కోర్టు స్టేల నడుమ ఈ ఎపిసోడ్ వెలుగు చూడలేదు. ఎట్టకేలకు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ లభించడంతో నెట్ఫ్లిక్స్ దీనిని స్ట్రీమింగ్ చేస్తోంది. అయితే, మిగిలిన ‘బ్యాడ్ బాయ్స్’ కథలకు, రామలింగరాజు కథకు చాలా వ్యత్యాసం ఉందన్నది ఈ ఎపిసోడ్ చూసిన వారికి స్పష్టంగా అర్థమవుతుంది. దేశం విడిచి పారిపోయిన వారు కొందరైతే.. తప్పు ఒప్పుకుని జైలుకెళ్లిన వ్యక్తిగా రామలింగరాజు ఇందులో హైలైట్ అయ్యారు.
ఉద్యోగుల గుండెల్లో ఇంకా ‘రాజు’గారే!
సాధారణంగా ఒక కంపెనీ యజమాని వల్ల ఉద్యోగం పోయి, రోడ్డున పడితే.. ఆ యజమానిపై కోపం, ద్వేషం ఉండటం సహజం. కానీ, సత్యం విషయంలో సీన్ రివర్స్. ఈ డాక్యుమెంటరీలో మాట్లాడిన మాజీ ఉద్యోగులు, ఉన్నతాధికారులు ఎవరూ రామలింగరాజు గురించి ఒక్క నెగెటివ్ మాట కూడా మాట్లాడలేదు. పైగా, ఆయన విజన్, ఆయన పనితీరు, ఆయనతో తమకున్న అనుబంధాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నారు. “సత్యం (Satyam) ఒక కంపెనీ కాదు, అదొక కుటుంబం” అని చెప్పిన ఉద్యోగుల మాటల్లో.. రాజు గారు వారిని ఎంతలా ఓన్ చేసుకున్నారో అర్థమవుతుంది. కేవలం పరిస్థితుల ప్రభావం వల్లే ఆయన అలా చేయాల్సి వచ్చిందని, ఆయన స్వతహాగా చెడ్డవాడు కాదని వారు బలంగా నమ్ముతున్నారు. స్కాం బయటపడిన రోజు తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయం కంటే.. తమ బాస్ ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడే అన్న ఆవేదనే వారిలో ఎక్కువగా కనిపించింది.
పులి మీద స్వారీ.. దిగితే తినేస్తుంది!
రామలింగరాజు తన తప్పును ఒప్పుకుంటూ రాసిన లేఖలో వాడిన ఒక ఉపమానం.. “Riding a Tiger” (పులి మీద స్వారీ). ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా దీని చుట్టూనే తిరిగింది. చిన్న కంపెనీగా మొదలై, ఐటీ దిగ్గజంగా ఎదిగిన క్రమంలో.. మార్కెట్ అంచనాలను అందుకోవడానికి, షేర్ విలువ పడిపోకుండా చూడడానికి చిన్న అబద్ధంతో మొదలైన ప్రయాణం.. చివరకు వేల కోట్ల రూపాయల కుంభకోణానికి ఎలా దారితీసిందో ఇందులో చూపించారు.
లాభాలను పెంచి చూపించడం, లేని ఉద్యోగులు ఉన్నట్టు సృష్టించడం, ఆ నిధులను మళ్లించడం.. ఇదంతా ఒక విషవలయంలా మారింది. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో అబద్ధం ఆడాల్సి వచ్చింది. చివరకు ఆ పులి మీద నుంచి దిగితే (నిజం చెప్తే) అది తినేస్తుంది (జైలుకు వెళ్లాలి), దిగకపోతే ఎప్పటికైనా పడిపోక తప్పదు. ఈ సందిగ్ధంలోనే ఆయన చివరి అస్త్రాన్ని ప్రయోగించారు.
భారతదేశ కార్పొరేట్ చరిత్రలో అరుదైన ‘Confession’
భారతదేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు, బ్యాంక్ లను ముంచేసిన వారు దర్జాగా విదేశాలకు పారిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. వ్యవస్థలోని లొసుగులను అడ్డం పెట్టుకుని, రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని సంవత్సరాల తరబడి తప్పించుకు తిరిగే వారిని చూస్తున్నాం. చట్టం వారిని పట్టుకోవడానికి ముప్పుతిప్పలు పడుతుంటుంది. కానీ, రామలింగరాజు స్టోరీ ఇక్కడ అందరికంటే భిన్నంగా నిలుస్తుంది.
ఈ డాక్యుమెంటరీలో విశ్లేషకులు అభిప్రాయపడినట్లు.. “భారత్ వంటి దేశంలో ఇలాంటి Confession (నేరాంగీకారం) చాలా అరుదు. సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో ఇలాంటివి చూస్తుంటాం. కానీ, ఇక్కడ తప్పు చేసినా సరే.. దొరక్కుండా మేనేజ్ చేసుకునే సంస్కృతి ఉంది.” రామలింగరాజుకు కూడా ఆ అవకాశం లేకపోలేదు. ఆయన స్థాయికి, ఆయనకున్న రాజకీయ పరిచయాలకు.. కావాలనుకుంటే ఆయన కూడా దేశం విడిచి వెళ్లిపోవడమో, లేదా కేసును ఏళ్ల తరబడి సాగదీయడమో చేయగలిగేవారు. కానీ, ఆయన అలా చేయలేదు.
తన తప్పును తానే స్వయంగా బయటపెట్టారు. “నేను తప్పు చేశాను, దానికి పూర్తి బాధ్యత నాదే” అని లేఖ రాసి, న్యాయవ్యవస్థకు లొంగిపోయారు. ఈ ఒక్క విషయంలో ఆయన్ని మెచ్చుకోకుండా ఉండలేం అని డాక్యుమెంటరీలో పలువురు అభిప్రాయపడ్డారు. బహుశా అందుకేనేమో.. స్కాం జరిగి ఇన్నేళ్లయినా, ఆయన పట్ల ప్రజల్లో, ఉద్యోగుల్లో సానుభూతి పూర్తిగా చచ్చిపోలేదు.
మిస్సైన కోణం: ఎమర్జెన్సీ సేవల రథసారధి (EMRI 108)
అయితే, ఈ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ఒక ప్రధాన లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అది ‘EMRI 108’ సర్వీస్ గురించి ప్రస్తావించకపోవడం. రామలింగరాజు చేసిన తప్పుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఆయన సమాజానికి చేసిన మేలు గురించి కూడా అంతే చర్చ జరగాలి. ‘బైరాజు ఫౌండేషన్’ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించారు. అన్నింటికంటే మించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునే ‘108 అంబులెన్స్’ సేవలు ఆయన మానసపుత్రికే. ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలను 108 సేవలు కాపాడుతున్నాయి అంటే.. దాని వెనుక రామలింగరాజు విజన్ ఉంది. స్కాం వల్ల ఇన్వెస్టర్లు డబ్బు నష్టపోయారు అనేది ఎంత నిజమో.. ఆయన ఆలోచనల వల్ల లక్షల మంది ప్రాణాలు దక్కాయి అనేది కూడా అంతే నిజం. దురదృష్టవశాత్తు, డాక్యుమెంటరీ కేవలం స్కాం చుట్టూ, ఆర్థిక నేరాల చుట్టూ తిరగడం వల్ల.. ఆయనలోని ఈ సామాజిక కోణం మరుగున పడిపోయింది. సత్యం కథను సమగ్రంగా చెప్పాలంటే.. ఈ నాణేనికి రెండో వైపును కూడా చూపించి ఉండాల్సింది.
న్యాయపోరాటం ఇంకా కొనసాగుతూనే..
రామలింగరాజు జైలుకు వెళ్లారు, బెయిల్ పై బయటకొచ్చారు. కానీ న్యాయపోరాటం ఇంకా ముగిసిపోలేదు. కింది కోర్టులు శిక్ష విధించినా, పై కోర్టుల్లో అప్పీళ్లు, విచారణలు సాగుతూనే ఉన్నాయి. ఈ సుదీర్ఘ ప్రక్రియలో ఆయన చాలా మౌనంగా ఉండిపోయారు. బయట ప్రపంచానికి దూరంగా, తన వ్యక్తిగత జీవితానికే పరిమితమయ్యారు.
నేరమా? విధి రాతా?
‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రేక్షకుడి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే.. రామలింగరాజును ఏ గాటన కట్టాలి? వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన ఆర్థిక నేరస్థుడిగానా? లేక తన ఆశయాల సాధనలో, కంపెనీని కాపాడుకునే క్రమంలో దారి తప్పిన ఒక దార్శనికుడిగానా?
ఆయన చేసింది ముమ్మాటికీ తప్పే. దాని వల్ల ఎంతోమంది ఇన్వెస్టర్లు నష్టపోయారు, భారతీయ ఐటీ రంగంపై నమ్మకం సడలింది. కానీ, తప్పును ఒప్పుకోవడంలో ఆయన చూపిన నిజాయితీ, విచారణకు ఆయన అందించిన సహకారం.. ఆయన్ని మిగిలిన ఆర్థిక నేరస్థుల కంటే భిన్నంగా నిలబెట్టాయి. వ్యవస్థలను మేనేజ్ చేయగలిగే శక్తి ఉండి కూడా.. ఆత్మసాక్షికి భయపడి లొంగిపోయిన తీరు.. బహుశా భవిష్యత్తు తరాలకు ఒక కేస్ స్టడీగా మిగిలిపోతుంది.
సత్యం (Satyam) కంప్యూటర్స్ పతనమై ఉండొచ్చు.. కానీ టెక్ మహీంద్రా రూపంలో అది మళ్ళీ పుంజుకుంది. అలాగే, రామలింగరాజు చేసిన తప్పులు చరిత్రలో మిగిలిపోయినా.. ఆయన చేసిన 108 వంటి మంచి పనులు కూడా ప్రజల గుండెల్లో నిలిచే ఉన్నాయి. మనిషిలోని మంచినీ, చెడునీ.. రెండింటినీ బేరీజు వేసుకుని చూడాల్సిన అవసరాన్ని ఈ డాక్యుమెంటరీ పరోక్షంగా గుర్తు చేసింది.

A Passionate Telugu Writer Covering Politics, Public Voice, And Current Affairs With Clarity And Insight. Dedicated To Presenting Unbiased Perspectives Rooted In Truth And Regional Relevance. Believes In Giving A Voice To The People Through Powerful Storytelling And Factual Reporting.
















