రాజకీయాల్లో విలువలు నానాటికీ దిగజారిపోతున్నాయనేది నిత్యం వినిపించే మాటే. కానీ, సాక్షాత్తూ కలియుగ దైవం తిరుమల వెంకన్న సొమ్మును కాజేసిన వ్యక్తిని పట్టుకుని, “అతను ఆస్తులు రాసిచ్చాడు.. మంచివాడు” అని ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత కితాబివ్వడం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయ (AP Politics) చరిత్రలో కనీవినీ ఎరుగనిది. తిరుమల పరకామణీ (Parakamani) చోరీ నిందితుడు రవికుమార్ (Ravi Kumar) వ్యవహారంలో వైఎస్ జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలు కేవలం ఆశ్చర్యాన్ని మాత్రమే కాదు.. భయంకరమైన నైతిక దివాలాకోరుతనాన్ని సూచిస్తున్నాయి.
దొంగతనం రిటర్న్ గిఫ్ట్ తో రద్దవుతుందా?
జగన్ వాదన ప్రకారం.. దొంగిలించిన సొమ్మును తిరిగి ఇచ్చేస్తే నేరం, నేరం కాకుండా పోతుందా? ఒక దొంగ జైలు శిక్షకు భయపడో, లేదా రాజకీయ పెద్దల ఒత్తిడితోనో ఆస్తులను సంస్థ పేరిట రాసిస్తే.. రాత్రికి రాత్రే అతను ‘దాత’గా మారిపోతాడా? ఇదే గనక చట్టమైతే.. రేపు బ్యాంకులు కొల్లగొట్టేవాడు, ప్రజల సొమ్ము తినేవాడు కూడా “కొంత వెనక్కి ఇస్తాను.. నన్ను వదిలేయండి” అని బేరాలాడుతాడు. నేరాన్ని ఖండించాల్సింది పోయి, దొంగ చేసిన “సెటిల్మెంట్”ను గొప్ప త్యాగంగా చిత్రికరించడం సమాజానికి ఏ సంకేతాలు ఇస్తుంది? ఇది పరోక్షంగా.. “దొరికితే వాటా ఇవ్వు.. దొరక్కపోతే మొత్తం నువ్వే ఉంచుకో” అనే కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెస్తోంది.
తెరవెనుక వాటాల భయమా?
రవికుమార్ ను జగన్ అంతగా వెనకేసుకురావడం వెనుక బలమైన రాజకీయ కారణాలున్నాయని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. టీటీడీకి 13 కోట్ల ఆస్తులు రాసిచ్చారన్నది పైకి కనిపిస్తున్న నిజం. మరి కనిపించకుండా పోయిన, వైసీపీ ముఖ్య నేతల జేబుల్లోకి వెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోట్లాది రూపాయల మాటేమిటి? రవికుమార్ నోరు విప్పితే.. ఆ తీగ కదిలి తమ డొంకలు కదులుతాయనే భయమే జగన్ చేత ఈ సమర్థనను పలికిస్తోందా? ఒక సామాన్య ఉద్యోగి దగ్గర అన్ని కోట్లు ఎలా పోగుపడ్డాయి? అవి ఎవరి అండతో వచ్చాయి? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత గత పాలకులుగా వైసీపీపై లేదా?
సాక్షి ప్రాణాలకు విలువేది?
అన్నింటికంటే దారుణమైన విషయం.. ఈ కేసులో సాక్షిగా ఉన్న ఏవీఎస్వో సతీష్ కుమార్ (AVSO Satish Kumar) అనుమానాస్పద మృతి. ఒక మనిషి ప్రాణం పోయింది. అది ఆత్మహత్యో, హత్యో ఇంకా తేలలేదు. ఆ మరణం వెనుక ఈ చోరీ వ్యవహారం తాలూకు ఒత్తిళ్లు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. అలాంటి తీవ్రమైన అంశంపై సీఐడీ దర్యాప్తు చేస్తుంటే.. అది “చాలా చిన్న విషయం” అని జగన్ ఎలా తీసిపారేయగలరు? తన పార్టీ ప్రయోజనాల కోసం ఒక ప్రాణాన్ని, ఒక నేరాన్ని, దైవ సన్నిధిలో జరిగిన అపచారాన్ని ఇంత తేలికగా తీసుకోవడం అమానుషం.
న్యాయానికి సవాల్
న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశంపై, దర్యాప్తు సంస్థ నివేదికలు ఇస్తున్న సమయంలో.. నిందితుడికి ‘క్లీన్ చిట్’ ఇవ్వడం ద్వారా జగన్ దర్యాప్తును ప్రభావితం చేయాలని చూస్తున్నారా? దొంగను సమర్థించడం అంటే, ఆ దొంగతనం వెనుక ఉన్న కుట్రదారులను కాపాడటమే. తిరుమల పవిత్రతను రాజకీయ స్వలాభం కోసం వాడుకోవడం, అక్రమార్కులకు అండగా నిలవడం ద్వారా.. ప్రజల్లో, భక్తుల్లో వైసీపీ పట్ల ఉన్న నమ్మకం మరింత సన్నగిల్లడం ఖాయం.
చివరగా ఒక్క మాట.. దేవుడి సొమ్మును కాపాడాల్సిన చేతులే.. దొంగల భుజం తడితే ఇక ధర్మానికి రక్షణ ఎక్కడ? పాలకులే దొంగలకు వకాల్తా పుచ్చుకుంటే.. చట్టం ఎవరికి చుట్టం? జగన్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతనో, లేదా అక్రమార్కులతో ఉన్న అనుబంధాన్నో స్పష్టంగా బయటపెట్టాయి. దొంగ ఎప్పటికీ దొంగే.. ఆస్తులు రాసిచ్చినంత మాత్రాన అతను పుణ్యాత్ముడు కాలేడు. ఈ నిజాన్ని గ్రహించలేకపోతే.. చరిత్ర కూడా పాలకులను క్షమించదు.

A Passionate Telugu Writer Covering Politics, Public Voice, And Current Affairs With Clarity And Insight. Dedicated To Presenting Unbiased Perspectives Rooted In Truth And Regional Relevance. Believes In Giving A Voice To The People Through Powerful Storytelling And Factual Reporting.















