NewsDabba

Sindhu Hospital: మూడు పార్టీల ‘సింధు హాస్పిటల్’!

Sindhu Hospital: హైదరాబాద్ నడిబొడ్డున హైటెక్ సిటీలో వెలసిన ‘సింధు క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్’ (Sindhu Hospital) కేవలం ఒక వైద్యాలయం మాత్రమే కాదు, అది తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రంలో సాగిన ఒక అద్భుతమైన వ్యూహరచనకు నిదర్శనం. ఒక కార్పొరేట్ దిగ్గజం, రాజకీయ వ్యూహకర్త తన అవసరాల కోసం ప్రధాన స్రవంతిలోని మూడు ప్రత్యర్థి పార్టీలను ఎలా ఏకం చేయగలరో ఈ హాస్పిటల్ నిర్మాణం నిరూపించింది. హెటెరో డ్రగ్స్ (Hetero Drugs) అధినేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్ధసారధి రెడ్డి తన కుమార్తె కృష్ణ సింధూరి జ్ఞాపకార్థం నిర్మించిన ఈ ఆసుపత్రి వెనుక ఉన్నది కేవలం సేవా దృక్పథం మాత్రమేనా అంటే, దాని వెనుక ఉన్న భూ కేటాయింపులు, కోర్టు వివాదాలు, రాజకీయ యూ-టర్న్‌లు మనల్ని విస్మయానికి గురిచేస్తాయి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం, మరోపక్క కేంద్ర ప్రభుత్వం.. పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ తన దారికి తెచ్చుకున్న బండి పార్ధసారధి రెడ్డి (Bandi Parthasarathi Reddy) ‘విజయం’ వెనుక ఉన్న అసలు కథను లోతుగా విశ్లేషించాల్సి ఉంది.

కేసీఆర్ ప్రోత్సాహం.. కోట్ల విలువైన భూమి లక్షలకే!*

సింధు ఆసుపత్రి (Sindhu Hospital) పునాదులు 2018లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పడ్డాయి. అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (KCR) చొరవతో ఖానామెట్ ప్రాంతంలో అత్యంత విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమిని సాయి సింధు ఫౌండేషన్‌కు (Sindhu Foundation) కేటాయించారు. బహిరంగ మార్కెట్లో దాదాపు 300 కోట్ల రూపాయలు పలికే ఈ భూమిని కేవలం సంవత్సరానికి రూ.1.47 లక్షల నామమాత్రపు అద్దెకు, అది కూడా 33 ఏళ్ల సుదీర్ఘ లీజుకు అప్పగించడం అప్పట్లో పెను దుమారం రేపింది. ఈ కేటాయింపుల వెనుక భారీ స్థాయిలో ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి అందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి ప్రతిఫలంగానే పార్ధసారధి రెడ్డికి (Bandi Partahasarathi Reddy) రాజ్యసభ సీటు దక్కిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రజా ప్రయోజనం కంటే రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ జరిగిన ఈ కేటాయింపులు తెలంగాణ ప్రభుత్వ భూ నిర్వహణపై అనేక ప్రశ్నలను లేవనెత్తాయి.

DCP Sumathi
CP Sumathi: ఐపీఎస్ ఆఫీసర్‌కే అర్ధరాత్రి వేధింపులు!

హైకోర్టు మొట్టికాయలు.. రాజకీయ హెచ్చరికలు

సింధు ఫౌండేషన్‌కు భూముల కేటాయింపు చట్టవిరుద్ధమంటూ 2023లో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సంచలన తీర్పునిచ్చింది. ఈ కేటాయింపులకు సంబంధించిన జీవోను రద్దు చేస్తూ, ప్రభుత్వం ఈ అంశాన్ని తిరిగి పరిశీలించాలని ఆదేశించింది. ఈ తీర్పును అస్త్రంగా చేసుకున్న అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ, తాము అధికారంలోకి వస్తే ఈ వివాదాస్పద భూ కేటాయింపులను రద్దు చేస్తామని, అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని బహిరంగంగా హెచ్చరించారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి మాటలు విని ప్రజలు నిజంగానే మార్పు వస్తుందని ఆశించారు. కానీ, రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను రేవంత్ రెడ్డి తదుపరి చర్యలు అక్షరాలా నిజం చేశాయి.

రేవంత్ రెడ్డి ‘యూ-టర్న్’

2023 డిసెంబరులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే నాటికే ఆసుపత్రి (Sindhu Hospital) నిర్మాణం 76 శాతం పూర్తయింది. ఎన్నికల ముందు భూములు రద్దు చేస్తానని భీషణ ప్రతిజ్ఞలు చేసిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక మాత్రం అనూహ్యంగా వ్యవహరించారు. అదే సింధు ఫౌండేషన్‌కు లీజును ఖరారు చేస్తూ జీవో నంబర్ 37 (GO.37) జారీ చేయడం గమనార్హం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘అక్రమం’ అనిపించిన కేటాయింపులు, అధికారంలోకి రాగానే ‘సక్రమం’గా ఎలా మారాయో అర్థం కాక రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనాలు లేదా ఇతరత్రా ఒత్తిళ్ల కారణంగానే రేవంత్ సర్కార్ ఈ మెత్తని వైఖరి అవలంబించిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మాట మీద నిలబడాల్సిన బాధ్యతను పక్కన పెట్టి, కార్పొరేట్ శక్తులకు తలవొగ్గారా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

మోడీ ప్రారంభోత్సవం:.. వ్యూహాత్మక ఆహ్వానం

ఆదివారం జరిగిన ఆసుపత్రి (Sindhu Hospital) ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) స్వయంగా విచ్చేసి బటన్ నొక్కి ప్రారంభించడం విశేషం. బీఆర్ఎస్ ఎంపీ నిర్మించిన ఆసుపత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇస్తే, బీజేపీ నేత ప్రారంభించడం అనే త్రివేణి సంగమం ఇక్కడ ఆవిష్కృతమైంది. అయితే, ఈ వేడుకలో ఆసుపత్రికి పునాది వేసిన కేసీఆర్‌ను కానీ, కేటీఆర్‌ను కానీ ఆహ్వానించకపోవడం లేదా వారు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఎన్నికల ముందు రద్దు చేస్తానన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేరు ఆహ్వాన పత్రికల్లో కనిపించినా, ఆయన హాజరు కాకపోవడం గమనార్హం. కేవలం కేంద్రం నుంచి మద్దతు కూడగట్టుకోవడమే లక్ష్యంగా ప్రధానిని ఆహ్వానించడం ద్వారా బండి పార్ధసారధి రెడ్డి (Bandi Parthasarathi Reddy) తన రాజకీయ పట్టును మరోసారి నిరూపించుకున్నారు.

BRS to TRS
TRS : మళ్లీ ‘టీఆర్ఎస్’ గూటికి బీఆర్ఎస్..!?

ఇది కూడా చదవండి: Vijay: దళపతికి నిత్య అగ్ని పరీక్ష!

ఫార్మా దిగ్గజం నుంచి హాస్పిటల్ అధినేత వరకు

ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని కందుకూరు గ్రామానికి చెందిన పార్ధసారధి రెడ్డి (Bandi Parthasarathi Reddy) సామాన్య స్థాయి నుంచి ప్రపంచస్థాయి ధనవంతుడిగా ఎదిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ, పీహెచ్‌డీ చేసిన ఆయన, హెటెరో డ్రగ్స్ (Hetero Drugs) సంస్థను స్థాపించి సుమారు ఏడు వేల మందికి పైగా ఉపాధి కల్పించారు. యాంటీ రెట్రో వైరల్ ఔషధాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన హెటెరో, 2024 ఫోర్బ్స్ జాబితాలో పార్ధసారధి రెడ్డిని 81వ స్థానంలో (నికర ఆస్తి రూ. 39,200 కోట్లు) నిలబెట్టింది. 2019లో టీటీడీ బోర్డు సభ్యుడిగా, 2022లో రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎదిగిన తీరు, వ్యాపార సామ్రాజ్యాన్ని రాజకీయాలతో మేళవించడంలో ఆయనకు ఉన్న నేర్పును చాటిచెబుతోంది.

మూడు పార్టీల ముద్దుబిడ్డ Bandi Parthasarathi Reddy

ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఒక విషయం స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ (BRS) భూమి ఇచ్చింది, కాంగ్రెస్ లీజును కొనసాగించింది, బీజేపీ ప్రారంభించింది. భావజాలపరంగా భిన్నమైన ఈ మూడు పార్టీలను తన ఆసుపత్రి ప్రాంగణంలో కలిపిన ఘనత నిస్సందేహంగా పార్ధసారధి రెడ్డిదే. సామాన్యుడికి ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా వంద నిబంధనలు అడ్డువచ్చే ఈ దేశంలో, వందల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి ఎలా వెళ్తున్నాయో ఈ ఘటన ఒక కళ్ళకు కట్టిన ఉదాహరణ. చట్టాలు, కోర్టు తీర్పులు సైతం రాజకీయ పలుకుబడి ముందు ఎంత బేలగా మారిపోతాయో సింధు ఆసుపత్రి (Sindhu Hospital) ఉదంతం స్పష్టం చేస్తోంది.

Revanth Reddy - Top 100
Revanth Reddy : ‘పవర్’ఫుల్ పర్సనాలిటీ..!

ప్రజా ప్రయోజనమా.. వ్యక్తిగత లాభమా?

సాయి సింధు ఆసుపత్రి వల్ల క్యాన్సర్ రోగులకు మేలు జరుగుతుందనే విషయంలో సందేహం లేదు, కానీ ఆ మేలు ప్రభుత్వ భూముల అడ్డగోలు కేటాయింపులను సమర్థించగలదా? అనేది అసలు ప్రశ్న. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా కార్పొరేట్ శక్తుల చుట్టూ రాజకీయాలు తిరుగుతుండటం ఆందోళనకరం. ఈ ‘బండి’ ప్రయాణం రాజకీయ నైతికతను తుంగలో తొక్కి సాగిందా లేక నిజమైన అభివృద్ధి కోసమా అనేది కాలమే నిర్ణయించాలి. రాజకీయ నాయకులు తమ మాటలకు కట్టుబడి ఉండకపోతే, ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది.

#SindhuHospital #BandiParthasaradhiReddy #HeteroDrugs #TelanganaPolitics #RevanthReddy #NarendraModi #KCR #HyderabadNews #HealthCarePolitics #PoliticalAnalysis

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment