Mudragada Padmanabha Reddy : రాజకీయాల్లో నిలకడ లేని మాట, మడమ తిప్పే నైజం ఒక నేత స్థాయిని ఎలా తగ్గిస్తాయో చెప్పడానికి ముద్రగడ పద్మనాభ రెడ్డి (Mudragada Padmanabha Reddy) తాజా లేఖ ఒక నిలువెత్తు సాక్ష్యం. ఒకప్పుడు కాపు జాతి (Kapu Caste) ఆరాధ్య దైవంగా, ఉద్యమ వీరుడిగా కీర్తించబడ్డ ముద్రగడ, నేడు కేవలం ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం తన సొంత జాతిని, తన సిద్ధాంతాలను ఎలా పణంగా పెడుతున్నారో ఈ లేఖ స్పష్టం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లను ఉద్దేశించి ఆయన సంధించిన అక్షరాల్లో పదును కంటే.. పస లేని ఆరోపణలు, పచ్చి అబద్ధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
‘రెడ్డి’గా మారిన ముద్రగడ: కాపుల గురించి మాట్లాడే నైతికత ఉందా?
ముద్రగడ (Mudragada) రాసిన లేఖలో ప్రధానంగా ‘కాపు కులాన్ని (Kapu caste) టార్గెట్ చేస్తున్నారు’ అనే ఆరోపణ వినిపించారు. కానీ ఇక్కడే ఒక ప్రాథమిక ప్రశ్న ఉదయిస్తుంది. ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని సవాల్ చేసి, తన ఓటమిని అంగీకరిస్తూ ‘ముద్రగడ పద్మనాభ రెడ్డి’గా (Mudragada Padmanabha Reddy) పేరు మార్చుకున్న వ్యక్తికి కాపుల (Kapu) గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది? తన సొంత సామాజిక వర్గాన్ని కాలదన్ని, రాజకీయ పంతం కోసం వేరే కులం పేరును తగిలించుకున్న ముద్రగడ, ఇప్పుడు మళ్ళీ అదే కాపు కార్డును ప్రయోగించడం ఆయన ద్వంద్వ నీతికి పరాకాష్ట. కాపు జాతిని (Kapu caste) వేరే రాష్ట్రానికి పంపించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ కులంపై ఆయనకు ఉన్న ప్రేమను కాక, ఆయనలోని నైరాశ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
వైసీపీ హయాంలో ‘మౌనం’.. కూటమి రాగానే ‘రణం’?
ముద్రగడ (Mudragada) రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే ఆయన ఎప్పుడూ టీడీపీ (TDP) అధికారంలో ఉన్నప్పుడే కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెస్తారు. గత వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో జగన్ మోహన్ రెడ్డి “కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం నా వల్ల కాదు, అది కేంద్రం పరిధిలోని అంశం” అని అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పినప్పుడు ముద్రగడ (Mudragada) గొంతు ఎందుకు పెగలలేదు? ఆనాడు జగన్ మాటలకు మద్దతుగా మౌనం వహించి, చివరకు అదే పార్టీలో చేరిన ముద్రగడ, నేడు చంద్రబాబును (Chandrababu) విమర్శించడం రాజకీయ అవకాశవాదం కాక మరేమిటి?
తిరుమల లడ్డూ అంశం: అబద్ధానికి ‘వంద’ అలంకారాలు
ముద్రగడ తన లేఖలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. తన తండ్రి అబద్ధం ఆడవద్దని చెప్పేవారని, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్ధాలు (lies) ఆడాల్సి వస్తుందని రాశారు. కానీ, విచిత్రమేమిటంటే అదే లేఖలో ఆయన తిరుమల లడ్డూ విషయంలో పచ్చి అబద్ధాన్ని రాసుకొచ్చారు.

లేఖలోని వాదన: తిరుమల (Tirumala) నెయ్యి కల్తీ కాలేదని సి.బి.ఐ (CBI) నివేదిక ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
వాస్తవం: అసలు సి.బి.ఐ ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ నివేదికను ఇంకా అధికారికంగా బయటపెట్టలేదు. అనధికారికంగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం కేవలం జంతు కొవ్వు అవశేషాలు లేవని చెప్పినట్లు తెలుస్తోంది. అదే నివేదికలో వైసీపీ హయాంలో తిరుమలకు సరఫరా అయింది అసలు నెయ్యే కాదని తేల్చింది. దాదాపు రూ.251 కోట్ల రూపాయల విలువైన కెమికల్స్ కలిపిన పామాయిల్ సరఫరా చేసినట్లు నివేదించినట్లు సమాచారం. ఈ విషయాన్ని దాచి పెట్టి అసలు సీబీఐ నెయ్యి కల్తీనే (Adulterated ghee) జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చినట్లు ముద్రగడ పద్మనాభం రాసుకొచ్చారు. తద్వారా “అబద్ధం ఆడొద్దు” అన్న తన తండ్రి మాటలను ముద్రగడ స్వయంగా తుంగలో తొక్కారు.
Pawan Kalyan పట్ల ద్వేషమా? భయమా?
చంద్రబాబు (Chandrababu) జైలులో ఉన్నప్పుడు డీలా పడిన కార్యకర్తలు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మద్దతు వల్ల రోడ్డు మీదకు వచ్చారని ముద్రగడ అంగీకరించారు. అయితే, ఇది చంద్రబాబుపై విమర్శ కంటే పవన్ కల్యాణ్ ప్రభావాన్ని అంగీకరించడం లాగే ఉంది. పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని కాపు (Kapu) సామాజిక వర్గం ఏకపక్షంగా ఆమోదించడాన్ని ముద్రగడ తట్టుకోలేకపోతున్నారా? తన ఉనికి కోల్పోతున్నాననే భయంతోనే పవన్ను, చంద్రబాబును కలిపి టార్గెట్ చేస్తున్నారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
మాజీ మంత్రులపై సానుభూతి – ఎవరి కోసం?
అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజిని వంటి వారిని అవమానిస్తున్నారని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలు, అక్రమ మైనింగ్, భూ కబ్జాల వంటి అంశాలపై విచారణ జరుగుతుంటే, దాన్ని ‘అవమానం’గా చిత్రీకరించడం హాస్యాస్పదం. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించినప్పుడు ముద్రగడకు ఈ ప్రజాస్వామ్యం, ఈ విలువలు గుర్తుకు రాలేదా?
రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించాలని ప్రధానిని కోరడం ద్వారా ప్రతిపక్షాన్ని జైల్లో పెట్టే అవకాశం ఉంటుందని ముద్రగడ సూచించడం ఆయనలోని అప్రజాస్వామిక ధోరణిని సూచిస్తోంది. గాడి తప్పిన పాలన అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, విచారణ ఎదుర్కొంటున్న తన పార్టీ నేతలను కాపాడుకోవడానికి పడుతున్న ఆరాటమే తప్ప ప్రజల కోణం కాదు.
ముద్రగడ ఇకనైనా మారతారా?
ముద్రగడ పద్మనాభ రెడ్డి (Mudragada Padmanabha Reddy) ఒక విషయాన్ని గ్రహించాలి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఒకసారి కాపు (Kapu) నేతగా, మరోసారి వైసీపీ ప్రతినిధిగా, ఇంకోసారి పేరు మార్చుకున్న వ్యక్తిగా ఆయన చేస్తున్న రాజకీయ విన్యాసాలు విజ్ఞులైన ఓటర్లను ఏమార్చలేవు. అబద్ధాలతో కూడిన లేఖలు రాయడం వల్ల ఆయన గౌరవం పెరగదు సదా, తన తండ్రి చెప్పినట్టుగా ఆ ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది.
ముద్రగడ లేఖలో చెప్పినట్టు రాష్ట్రంలో దహనకాండ సాగడం లేదు, రాజ్యాంగ విరుద్ధమైన పాలన అంతకంటే లేదు. నిజానికి ఆయనలోని ‘రాజకీయ అసహనం’ మాత్రమే దహనమవుతోంది. ఇప్పటికైనా కుల రాజకీయాలను పక్కన పెట్టి, వాస్తవాలను గౌరవిస్తూ లేఖలు రాస్తే ఆయనకు, ఆయన అనుసరిస్తున్న పార్టీకి మంచిది. లేదంటే, ‘రెడ్డి’గా మారిన ముద్రగడను కాపులు కాదనుకుంటారు, అటు రెడ్డి సామాజిక వర్గం కూడా తనవాడిగా అంగీకరించదు. ముద్రగడ పరిస్థితి అటు ఇటు కాకుండా పోయే ప్రమాదం ఉంది.
















