Dirty Leaders : ఒకప్పుడు రాజకీయాలంటే (Politics) త్యాగం, ప్రజా సేవ, నిబద్ధతకు మారుపేరు. కానీ, నేడు రాజకీయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు వికృతంగా మారుతున్నాయి. అధికారం చేతికి రాగానే అపరిమితమైన అహంకారం, అదుపులేని వ్యక్తిగత బలహీనతలు ప్రజాప్రతినిధులను డ్రగ్స్ పార్టీలకు, క్యాసినోలకు, అశ్లీల వివాదాలకు బందీలను చేస్తున్నాయి. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన నాయకులు, చీకటి సామ్రాజ్యాల్లో చిక్కుకుని తమ పార్టీల ప్రతిష్టను బజారున పడేస్తున్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ పార్టీ వివాదం నుండి గతంలో వెలుగు చూసిన అనేక నైతిక వైఫల్యాల వరకు… ఇవన్నీ ఒకటే ప్రశ్నను సంధిస్తున్నాయి: మన నాయకులు (Dirty Leaders) తమ బలహీనతలను వదులుకుంటారా? లేక ప్రజలే వారిని రాజకీయాల నుండి వదిలించుకోవాలా?
అధికార గర్వం – నైతిక విస్మృతి
ప్రజాస్వామ్యంలో ఓటు వేసి గెలిపించిన ప్రజలు తమ ప్రతినిధిని ఒక మార్గదర్శిగా చూస్తారు. కానీ, ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు చూస్తుంటే, చట్టసభలకు వెళ్లే అర్హతలను కేవలం డబ్బు, బలప్రదర్శన నిర్ణయిస్తున్నాయని స్పష్టమవుతోంది. తెలంగాణలో (Telangana) ఇటీవల వెలుగుచూసిన డ్రగ్స్ (Drugs) పార్టీ వ్యవహారం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ (Elur TDP MP Putta Mahesh Yadav) వంటి యువ నాయకులు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం కేవలం ఒక వ్యక్తిగత వైఫల్యం మాత్రమే కాదు, అది ఒక వ్యవస్థీకృత నైతిక పతనానికి సంకేతం. పార్టీలు షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవచ్చు, కానీ ప్రజల్లో కలిగిన అసహ్యం అంత తేలికగా చెరిగిపోదు.
డ్రగ్స్, క్యాసినోలు, ఫామ్ హౌస్ సంస్కృతి
ఒకప్పుడు రాజకీయ నాయకులు ప్రజల మధ్య ఉండేవారు. ఇప్పుడు వారు ఫామ్ హౌస్ల గోడల మధ్య, సీక్రెట్ పార్టీల వెలుగుల్లో కనిపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohith Reddy) ఫామ్ హౌస్ వ్యవహారాలు, అక్కడ జరిగిన డ్రగ్స్ (Drugs) పార్టీల ఆరోపణలు రాజకీయ నాయకుల జీవనశైలి ఎంత విలాసవంతంగా, ప్రమాదకరంగా మారిందో తెలియజేస్తున్నాయి. హైదరాబాద్ వంటి మహానగరాలను డ్రగ్స్ మాఫియాకు (Drugs Mafia) అడ్డాలుగా మారుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయంటే, పాలకులు (Rulers) తమ బాధ్యతను ఎంతగా విస్మరించారో అర్థం చేసుకోవచ్చు. యువతకు మార్గదర్శకంగా ఉండాల్సిన నాయకులే మత్తులో జోగుతుంటే, సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటి?
గతప్రాభవం ఎక్కడ? క్రమశిక్షణ ఏది?
రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగాలంటే కేవలం అధికారం ఉంటే సరిపోదు, వ్యక్తిగత క్రమశిక్షణ అత్యంత అవసరం. ఈ విషయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. 30 ఏళ్లకు పైగా లైమ్ లైట్లో ఉండటానికి ఆయన పాటిస్తున్న క్రమశిక్షణే కారణమని విశ్లేషకులు చెబుతుంటారు. కానీ, నేటి తరం నాయకుల్లో ఆ ఓపిక, ఆ నిబద్ధత కరువయ్యాయి. రాత్రికి రాత్రే కోట్లు సంపాదించాలి, మొదటిసారి గెలవగానే మంత్రి పదవులు కావాలి అనే ఆరాటం వారిని తప్పుదోవ పట్టిస్తోంది. గతంలో పుత్తలపల్లి సుందరయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య వంటి మహానుభావులు తమ జీవితాలను ప్రజల కోసం ధారబోశారు. వారు నడిచిన చట్టసభల్లో నేడు అశ్లీల వీడియోల వివాదాలు, క్యాసినోల గొడవలు వినాల్సి రావడం ప్రజాస్వామ్యానికే అవమానం. గత ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులపై (Dirty Leaders) వచ్చిన నైతిక ఆరోపణలు, వైరల్ అయిన వీడియోలు ప్రజల దృష్టిలో రాజకీయ నాయకుడి పట్ల ఉన్న గౌరవాన్ని పూర్తిగా తగ్గించేశాయి.
డబ్బే ప్రాతిపదిక
రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు వారి గుణగణాలను, బ్యాక్ గ్రౌండ్ను పట్టించుకోవడం మానేశాయి. కేవలం ‘ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టగలరు?’ అనేదే ఏకైక ప్రాతిపదికగా మారుతోంది. డబ్బున్న ప్రతివాడూ టికెట్ కొనుక్కోగలడు కానీ, ప్రజా సేవ చేసే మనసును కొనుక్కోలేడు. పాత అలవాట్లు, బలహీనతలు ఉన్నవారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, వారు తమ పాత పంథానే కొనసాగిస్తున్నారు. దీనివల్ల పార్టీల ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా, సామాన్య ప్రజల్లో రాజకీయాల పట్ల అసహ్యం పెరుగుతోంది.
ఇది కూడా చదవండి: Putta Mahesh Yadav : డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా..! ఘన చరిత్రే..!!
మార్పు ఎక్కడ మొదలవ్వాలి?
ప్రజాప్రతినిధులు తమను తాము నియోజకవర్గాలకు ‘సామంత రాజులు’గా భావించడం మానుకోవాలి. అధికారం అనేది ప్రజలు ఇచ్చిన బాధ్యత అని గుర్తించాలి. వ్యక్తిగత బలహీనతలను అదుపులో పెట్టుకోలేని వారు ప్రజా జీవితానికి అనర్హులు. కేవలం పార్టీలు నోటీసులు ఇస్తే సరిపోదు, ప్రజలే ఇలాంటి నైతికత లేని నాయకులను రాజకీయాల నుండి బహిష్కరించాలి. పదునైన చట్టాలు, అంతకంటే పటిష్టమైన ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడే రాజకీయాల్లో ఈ ప్రక్షాళన సాధ్యమవుతుంది. లేదంటే, ఈ వ్యవస్థ మరింత దిగజారిపోవడమే తప్ప మెరుగుపడే ఆస్కారం కనిపించదు.















